ఒక బలమైన ప్రజా ఉద్యమం బయలుదేరినప్పుడు దాని ప్రభావం ఉపరితల నిర్మాణంలో సకల రంగాల మీద ఉంటుంది అనడానికి పందొమ్మిది వందల డెబ్బైలో మొదలైన విరసం ఒక ఉదాహరణ. నక్షల్బరి రాజేసిన నిప్పురవ్వల వెలుగులో బయలుదేరిన శ్రీకాకుళ పోరాటం నాటి కవి లోకానికి ఒక దిశా నిర్దేశం చేసింది. సుబ్బారావు పాణి గ్రాహి పాట, పంచాది దంపతుల త్యాగం, కోరన్న మంగన్నల బలిదానం ఒక చారిత్రిక ప్రత్యామ్నాయ పోరాటాలకు పునాదిగా పనిచేశాయి. జాతీయోద్యమ పోరాటానికి బీజాలు వేసిన అనేక కళా పోరాటాల లో అభ్యుదయ రచయితల సంఘం పోషించిన నిర్ధాయక పాత్ర ఎంతో కాలం నిలబడలేక పోయింది. అరసం ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయాలను ‘విప్లవ పోరాటం వెళ్ళ గుర్రం స్వారీ అనుకున్నావా స్వామీ పులిగుహలోకి వెళ్ళ సాహసించిన వాడే పులిపిల్లను పట్టి తెస్తాడు. వెయ్యి కత్తి వేట్లకు జంకని వాడే రాజును పదవీ భ్రబ్రస్టు చేస్తాడు’ ఈ మాట అనేనాటికి విరసం ఒక్క ఏడాది ‘నెలబాలుడు’ ఆ నెలబాలుడు పెరిగి పెద్దవాడై వినూత్న జీవన మహాకావ్యాన్ని రచిస్తాడు’ అని ఉద్యమ ద్రోహులను నిరసిస్తూ ఉద్యమం ఆగదు అని పిలుపునిచ్చిన స్ఫూర్తి శివసాగర్ కాల పురోగమనాన్ని విరసానికి దిశా నిర్దేశం చేసాడు. నాటి సమాజంలో సాహిత్యం లో పెరిగిన నిష్క్రియాపరత్వాన్ని నాటి దిగంబర కవులు ప్రారద్రోలి అనే స్ఫూర్తి తో ఒక నయా సాహిత్య వాతావరణాన్ని సృష్టించి ఒక బలమైన పొలిటికల్ నినాదంగా మార్చాడు. అలా ముందుకు వచ్చిన శ్రీకాకుళ పోరాటాన్ని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాల్సిన చారిత్రక బాధ్యత కవుల మేధావుల ముందు ఉంది అని ప్రతిన బూనాయి. దిగంబర కవితా ఉద్యమం ఒక రాజకీయ నిర్మాణ రూపాన్ని తీసుకోలేక పోయింది. మరో వైపు పార్లమెంటరీ రాజకీయాల లో పెరిగిన నిష్క్రియాపరత్వం, బలహీనమైన ప్రతిపక్ష రాజకీయాలు ఒక బలమైన ధిక్కార స్వరం కోసం ఎదురు చూసాయి. ఆ సంక్షుభిత కాలంలో ఆవిర్భవించిన విరసంను విశాల ప్రజానీకం చారిత్రక అవసరం గా భావించింది. అది కేవలం కవితాలోకం మీదనే కాకుండా విశాల ప్రజానీకం మీద తీవ్రమైన ప్రభావం చూపింది. అది నిజమైన ప్రజా రాజకీయాలను ఎత్తిపట్టింది. శ్రీకాకుళ నుండి సిరిసిల్ల, జగిత్యాల దాకా కళింగ నగర్, నందిగ్రాం నుండి జనతన సర్కార్ దాకా ఐదు దశాబ్దాల ప్రజా పోరాటాలకు ఒక దిశా నిర్దేశం చేసింది. ఒక సాహిత్య సంస్థ ఇంతటి బలమైన మేథో ధారను సుధీర్గ కాలం మోయడం సామాన్యమైన విషయం కాదు. దాని వెనక అనేక త్యాగాలు ఉన్నాయి, చిద్రమైన స్వప్నాలు ఉన్నాయి. అసామాన్య పోరాట పరంపర ఉంది. నాలుగు దశాబ్దాల ప్రజా ప్రత్యామ్నాయ పోరాటాలకు సాకబోసిన సాహసవంతుల తెగువ ఉంది. ‘అది శత్రువు గుండెల్లో విషపు బాణం లా, ద్రోహి పక్కలో మృత్యు శూలం లా, ధనిక స్వామ్యపు మెడను విరిచే గండ్ర గొడ్డలి చండ శౌర్యం తో’ మర తుపాకులు బుజాన వేసుకొని ధర్మయుద్ధం కై బయలుదేరింది. నిజమైన ప్రజా రాజకీయాలను ఎత్తిపట్టడం మూలంగా నాటి ప్రజా అసహనానికి విరసం ఒక వాహిక అయ్యింది. దాని ఉనికి, అస్తిత్వం ప్రజా ధిక్కారం నుంచి పురుడు పోసుకుంది. ఒకటి నిజం నాటి ప్రజా పోరాటాల లో అడవికీ మైదానానికి ఒక ప్రజా వారధిగా విరసం పనిచేసింది.
ఈ దేశంలో ఆదివాసీ దిక్కారానికి వందల ఏళ్ళ ప్రతిఘటనా పోరాట చరిత్ర ఉంది. ఒక నాటి సంథాల్ కావొచ్చు, రాంజీ గోండ్, కొమురం భీ౦ ఇవ్వాళ జనతన సర్కార్ కేంద్రంగా నడుస్తున్న ప్రజా ప్రత్యామ్నాయ పోరాటం వర్తమాన మనోఫలకం మీద చెరగని ముద్ర వేసింది. ఈ దేశ మూలవాసుల అస్తిత్వం ఉనికి ప్రమాదం లో పడిన సమయాన, మైదాన ప్రాంతం బలహీనమైన కాలాన, ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించింది మొదటి నుండీ ఆదివాసీలే. ఇవ్వాళ ఆ ఆదివాసీ నిలబడేందుకు అడుగుజాగా కూడా మిగలకుండా చేసే కుట్రకు తెరతీసింది వర్తమానం. ఆదివాసీ అస్తిత్వ ప్రతీక అయిన కొమురం భీం చరిత్రను ఎత్తిపట్టింది విరసం. ప్రజలే నిజమైన విప్లవ నిర్మాతలు అనే సూక్తికి చిరునామా మారిన చరిత్ర అది. ఆధిపత్య చర్చల్లో కనబడకుండా వినబడకుండా మాయం అయిన మట్టి మనుషుల దిక్కారానికి ప్రతీక అయిన రాగో, మిడ్కో పరంపరను సాహిత్యం లో తిరుగుబాటు ప్రతీక అయ్యింది. తద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవానికి సైద్దాంతిక చర్చలకు దారి తీసింది.
దెబ్బయ్యో దశకం లో సకల రంగాల వైఫల్యం మీద ప్రత్యామ్నాయ పాత్ర పోషించి. ఐదు దశబ్ధాలుగా నిర్భందాలకు వెరవకుండా నిక్కచ్చిగా సుదీర్ఘ కాలం ప్రజా రాజకీయాలను నిలబెట్టే క్రమం లో విరసం ఒక సంఘంగా అనుభవించిన నిర్భందాలు, అది పోషించిన నిర్ధాయక త్యాగమయ పాత్ర చిన్నది కాదు. సాహిత్యానికి, ప్రజా ఆలోచనకూ, రాజకీయ నిర్మాణాలకూ సాహిత్యం ఎవరి పక్షాన ఉండాలనేది నేర్పింది. రాసే కవికి నిబద్దత ఉండాలనే ఎరుకను ఇచ్చింది, సమస్త కళలు, కళాకారులు పోరాడే శ్రమ జీవుల పక్షాన ఉండాలని చెప్పింది. ప్రజా బాణీ ప్రజల విముక్తి గీతం కావాలని చెప్పింది. నాటి నిస్పృహ సమాజానికి ఒక ఆసరా ఇచ్చింది. కోట్లాది ప్రజా గొంతుక అయింది.
తొలి నాటి సామాజిక తిరుగుబాటు స్వరానికి సైద్ధాంతిక వెలుగు నిచ్చింది విరసం. మారుమూల అటవీ ప్రాంతాల లో మొదలైన ఆ ప్రత్యామ్నాయ ఆలోచనకు పదును పెట్టింది. పోరాట వీరుల నెత్తుటి తర్పణకు సాంత్వన నిచ్చింది. నక్సల్బరీలో మెరిసిన వెలుగును తెలుగునాటకు మళ్లించింది. సమస్త కళా రూపాలకూ నిట్టాడి లా నిలబడే ఎరకను ఇచ్చింది. ఈ దేశంలో తొలి సామాజిక విప్లవకారుల మొదలు నేటి ప్రజాపోరాటాల దాకా ఆదివాసులు త్యాగాలకు వారు సాకబోసిన త్యాగాలను కొనియాడి ప్రాణాలకు ఓదార్పు నిచ్చింది విరసం.
నా ముందు తరాలకీ, మా తరానికీ విరసం ఇచ్చిన తాత్విక భూమిక. మా ముందు తరం మాకిచ్చిన వారసత్వ పోరాట సంపద. చూస్తూ ఉండగానే విరసం యాభై ఏళ్ళు జరుపుకుంటున్నది. ఐదు దశాబ్దాల గమ్యం, గమనం తెలంగాణ సమాజ హృదయ నాడిలా ఎందరో అమరుల రక్తతర్పణ త్యాగాలగుర్తుల మీద నావలా సాగుతోంది. అవును.. మేం విరసంతో ప్రభావితమై నాలుగు ముక్కలు నేర్చుకున్నం. రాస్తున్నం. విరసంతో ప్రభావితమై ఈ కాలానికి పోరాటం ఒక ఆదర్శం కాదు, ఒక అవసరం అని గుర్తెరిగినవాళ్లం.
పందొమ్మిది వందల అరవైల తర్వాత మారిన సంక్షోభాలు చిన్నవి కావు. తూర్పు యూరోప్ పరిణామాలు రెండు ప్రపంచాల వాదం ఏక ధ్రువ ప్రపంచంగా మారడం చరిత్ర రచనలో, సామాజిక సంవాదంలో ఏకద్రువ ప్రపంచాన్ని దిక్కరించిన స్వరాలు అప్పుడప్పుడే గొంతు విప్పుతున్నాయి. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తమవైన ప్రజా యుద్ద రాజకీయాలు నడిపాయి. చైనాలో, చీలీ లో ఆ ఒరవడికి ఒక మేథో కూర్పు అయ్యింది. తూర్పుగాలి పడమటి గాలి ఆధిపత్యం చెలాయిస్తున్న దశలో ఆఫ్రికా ఆసియా,దక్షిణ అమెరికా తూర్పు దేశాలు యూరోప్ పైన పశ్చిమ దేశాల పై వచ్చిన తూర్పు పవనం జడివాన లా చుట్టుముట్టి పెట్టుబడి దారీ సమాజం మీద సునామీ లా బయలుదేరి నడిచిన ప్రజా రాజకీయాలు కాలపరీక్షలో నిలబడి తమను తాము పునః సమీక్ష చేసుకునే దశలో దళిత అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వచ్చాయి.
ఇంత చైతన్యానికి కారణం అయిన విరసం దాని ముందుకు వచ్చిన అదే రీతిలో అనేక సవాళ్ళను ఎదుర్కొంది ఎనభయ్యో దశకం లో మొదలైన పితృస్వామ్యం ,వర్గ రాజకీయాల స్థానే కుల, వర్ణ, లింగ, ప్రాంతీయ అస్తిత్వ వేదనల వెలుగులో చరిత్రను సాహిత్యాన్ని ప్రజా ఉద్యమాలను పునః సమీక్ష చేస్తూ ఆదిపత్య చర్చలను నిలదీసింది. సుధీర్గమైన పార్లమెంటరీ రాజకీయాల మూలంగా కానీ దీర్ఘ కాలిక సాయుధ రాజకీయాల మూలంగా దశాబ్దాల సాహిత్య సాంస్కృతిక పోరాటాలు నడిచినా కూడా ఈ సమాజం లో అట్టడుగున కనిపించని కొన్ని సమశ్యలకు ముఖ్యంగా కుల సమశ్యను అర్ధం చేసుకోవడం దానికి ప్రత్యామ్నాయ పోరాటాలు రూపొందించడం లో జరిగిన అలసత్వం మూలంగా ఆ దానికి పరిష్కారాలు దొరక పోగా అది మరింత జటిలమైన సమశ్యగా మిగిలింది. ఆ నేపధ్యం లో బయలుదేరిన దళిత అస్తిత్వ ఉద్యమం అత్యున్నత మైనది. అదేదో హఠాత్తుగా గాలి నుండి ఊడి పడలేదు, వాళ్ళెవరో అధ్యదయ శిభిరాలకు బయట ఉండి రాళ్ళేసిన వాళ్ళు కాదు. అప్పటివరకూ మార్క్సిస్ట్ శిభిరాల లో పనిచేసిన కొన్ని గొంతుకలు అవి లేవనెత్తిన న్యాయమైన ప్రశ్నలను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది. జవాబు చెప్పాల్సిన కనీస బాధ్యత అభ్యుదయ విప్లవ శక్తులది. అలా జవాబులు ఇవ్వక పోగా ఆ ప్రశ్నలను ఆ ప్రశ్నలు వేసిన వ్యక్తులను, సమూహాలను ‘పోస్ట్ మోడరన్’ ఆలోచనలు అనీ అభివృద్ధి నిరోధక శక్తులు అనీ విశాల ప్రజా ఉద్యమ శ్రేణులను చీల్చే ప్రతీఘాతక శక్తులు అని ముద్రవేసి ఆ ప్రశ్నలను శక్తులను నిర్వీర్యం చేసింది. అది కేవలం విశాల అభ్యుదయ శక్తులు వైఫల్యం మాత్రమే కాదు మార్క్సిస్ట్ మిలిటెంట్ శక్తుల వైఫల్యమూ ఆ క్రమం లో విరసానికి మినహాయింపు లేదు. దీనికి జావాబు చెప్పలేక అది మరింత సంక్షోభం కి కూరుక పోయింది.
దానితోబాటు సుదీర్ఘమైన విప్లవ సాహిత్య ఒరవడి ఉన్న వ్యక్తులు ఆ రాజకీయాల తో విభేదించిన లేదా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారి పట్ల రాజకీయ సమూహం స్పందించాల్సిన దాని కన్నా దూకుడుగా చేసిన మేథోదాడి విరసం వైఫల్యమే. అటువంటి వారి పట్ల కనీస రిసైప్రొకల్ బాంధవ్యాలను కాపాడుకోలేక పోయింది. ముందుతరం కవుల రచనలను ఈ తరానికి అందించడంలో కనీస ప్రజాస్వామిక ధోరణి అనుభవించలేదు. అంతేకాకుండా రాయని భాస్కరుల అజమాయిషీ ఇంకా ఎక్కువే ఉంది. ఈ తరానికి అవసరం అయిన కవులను అందించడం తోబాటు తాము నమ్మిన రాజకీయాల ఇరుసుగా విమర్శను మేథో రంగం లో చేయాల్సిన కృషి మరింత చేయాల్సి ఉండే.
విప్లవ సాహిత్యం అంటే సాయుధ రాజకీయాల సమూహారమే కాదు అట్టడుగున పడి కనిపించని కథలు వెలికి తీయాల్సిన కనీస బాధ్యత ఆ సంఘం మీద ఉంది. ఆధునికతను అర్ధం చేసుకోవడంలో ఈ నాటికీ నవ్య సంప్రదాయ వాదం దాటి బయట పడలేదు. గురజాడ కన్నా ముందు ఉన్న తొలి సామాజిక కవుల ప్రాసంగికతను గుర్తించడంలో వైఫల్యంతో బాటు వాళ్ళు చెబుతున్న నూతన మానవుడి ఆవిష్కరణ గురజాడ కేంద్రీకృత చర్చను ఇంకా అధిగ మించాల్సే ఉంది.
విరసం కథ, కవిత్వం, పాట మినహాయిస్తే నవల, విమర్శ, తోబాటు నిమ్న కులాల సంస్కృతుల మీద అంటరాని విలక్షణమైన జీవితాల కేంద్రీకృతమైన బలమైన రచనలు విరసం రావాల్సి ఉండే. కథ విమర్శ లాంటి ప్రక్రియల్లో, తాత్విక రంగంలో కళ్యాణరావు, త్రిపురనేని మధుసూదనరావు, ప్రజా బాణికి ప్రాణం పోసి‘ప్రజల నుంచి ప్రజల కొరకు ఉద్యమమూ, సాహిత్యమూ ఉండాలి’’ అన్న మావో సూక్తిని తన రచనల్లోకి ఒంపిన శివసాగర్ కొనసాగింపు విరసం నుంచి జరగక పోవడం వైఫల్యమే. అనేక నిర్బంధాల మధ్య సాహిత్య పాయకు దిశా నిర్ధేశం ఇచ్చిన రచనలు ఎన్నో విరసం నుండి వచ్చినా కవిత్వం లో శివసాగర్, కథ లో అల్లం రాజయ్య,నవలా ప్రపంచం లో కళ్యాణ్రావు ఈ ఐదు దశబ్ధాల విరసం సాంప్రదాయం నిలుపుకున్న దీప దారులు. వాళ్ళిచ్చిన స్ఫూర్తి వేలాది మంది విరసం ప్రాభావం లోకి తీసుకొని వచ్చింది.
నిర్దిష్టంగా చెప్పాలి అంటే లక్షింపేట మారణకాండ సందర్భంగా కేవలం కుల సమశ్య.కాదు భూమి సమశ్య మాత్రమే అని వ్యాఖ్యానించింది. పందొమ్మిది వందల ఎనభై ల తర్వాత ఆవిష్కృతం అయిన నూతన సమీకరణాల వెలుగులో బలంగా ముందుకు వచ్చిన కుల చర్చ మీద మారిన సామాజిక సంక్లిష్టాలను ముఖ్యంగా అస్థిత్వ రాజకీయాలను అర్ధం చేసుకోవడం లో అది పూర్తిగా విఫలం అయ్యింది.
ఇన్ని లోపాలు ఉన్నా ఈ సంక్షుభిత కాలానికి విరసం ప్రాసంగికత కొనసాగింపూ అవసరం ఉంది. వలస పాలన మొదలు వర్తమాన పాలకుల దాకా ఈ దేశ ప్రజలు అనుభవించని నిర్భందాలు లేవు. కానీ గతం ఎన్నడూ అనుభవించని ఫాసిస్టు పాలనలోకి ఈ దేశం మారింది. ప్రజాబద్రత మరింత ప్రమాదం లోకి నెట్టబడింది, నిర్భంధం వెర్రితలలు వేసి నువ్వు తినే తిండినీ, నీ ఉనికినీ, నీ అస్తిత్వాన్ని ,ఆఖరికి నీ పౌరసత్వానికీ ముప్పులా మారింది. ఈ దేశ వనరులను కాపాడుతా అని పాలనలోకి వచ్చిన సంఘేయులు సకల వ్యవస్తలనూ అఘాతం లోకి నెట్టాయి. అంతేకాకుండా పౌర ప్రజాస్వామిక భావన మిథ్య గా దిగజార్చారు. ఈ విపత్తును ఉపేక్షిస్తే అది ప్రజాస్వామిక భావనకే పెనుముప్పు. ఈ సంక్షుభిత కాలానికి విశాల ప్రజా రాశులను ఏకం చేసి అన్యాయపు అక్రమ పునాదుల మీద నిలబడ్డ ఈ పాలన పట్ల మరింత మిలిటెంట్ పోరాటాలకు సిద్దం చేయాల్సిన నిర్ధాయక బాధ్యత విరసం మీద ఉంది. ఆ క్రమంలో కలిసొచ్చే విశాల ప్రజా సమూహాన్ని కలుపుకొని ప్రత్యామ్నాయ ప్రతిఘటనా సమరశీల పోరాటాలకు వాన్ గార్డ్ లాగా విరసం నిలబడాలి. ఆ క్రమానికి చేయూత నివ్వడమే నేటి కవుల కళాకారుల మేథావుల బాధ్యత.
డా.గుర్రం సీతారాములు