Pain and tears… all the way
చిరుగాలి తరగలకే పరవశించిపోయే
ఈ సుకుమార హృదయాన్ని నరికి పోగులు
పెట్టావుకదరా నాకొడకా!
మాలోళ్ళ మురికి కన్నీళ్ళతో నా పవిత్ర మనో
మందిరాన్ని మలినం చేశావుగదరా ఇజీకుమారా!
ఇలా నన్ను చిత్రహింసల పాల్జేయడానికి
నీకెవరిచ్చార్రా హక్కు!
నువ్వూ, నీ కథలూ నాశనమైపోను!
హవ్వ! నా మునికాంతపల్లంటూ అంత
మురిసిపోతున్నావేం! అంత మిడిసి
పడుతున్నావేంరా ముండనాయాలా!
మేమెంతా నెత్తురుకక్కుకు చావాలని
కళాత్మక కుట్రజేసి, అవన్నీ వొట్టి
కతలని చెబుతావా? దుర్మార్గుడా!
దేశద్రోహం, పైగా తెలుగు సాహిత్య ద్రోహానికి
పాల్పడిన నిన్ను శిలువ ఎక్కించకుండా
వూరుకుంటామనే అనుకుంటున్నావా?
ఆ రాతలేంటి? ఆ బూతులేంటి?…
స్వేచ్ఛ కోరుతున్న
నీ చేతుల్లో మేకులు దించకపోతామా…
రేపైనా… మాపైనా…
*** *** ***
తెలుగు సాహిత్యాకాశంలో ఒక కొత్త నక్షత్రం వుదయించింది.
దాని పేరు సొలోమోన్ విజయ్ కుమార్.
అతని సంవేదనకి పెట్టుకున్న పేరు :
‘మునికాంతపల్లి కతలు’. వంద పేజీలు కూడా లేని చిన్న కథల పుస్తకం యిది.
ఇప్పటికే పేరు తెచ్చుకుంది. పెద్దవాళ్లంతా మంచి కథలని మెచ్చుకున్నారు. నేనే కొంత ఆలస్యంగా చదివాను. విజయ్ కుమార్ వయసు 42.
నెల్లూరులో ఉంటాడు. ఆ జిల్లాలోనే ఒక దిక్కుమాలిన దళితవాడ మునికాంతపల్లి.
అక్కడ తన అనుభవాన్నే, ఆ భాషలోనే,
ఆ యాసతోనే, ఆ మాలపల్లె జనం
మాటల్లోనే గుండెలవిసేలా రాశాడు.
అవమానాలను అక్షరాలుగా మలచడంలో
అతని శిల్పదృష్టి… కళాత్మకం.
ఆ శైలి… కథ చెప్పే తీరు సృజనాత్మకం.
*** *** ***
‘మాలపల్లి’ నవలకు రాసిన పరిచయ వాక్యాల్లో, ఉన్నవ లక్ష్మీనారాయణ, “ఒక విధంగా మాట్లాడటం, మరి ఒక విధంగా రాయటం అలవాటయింది. కృత్రిమ రూపాలకలవాటుపడ్డ నోటితో వాడుక భాష చదవబోతే కొందరికి ఎబ్బెట్టుగా కనబడటం నేనెరుగుదును… మాట్లాడే మోస్తరుగానే చదవడం ప్రారంభిస్తే వాడుక భాషలోని రుచి కనపడుతుంది గానీ, లేకపోతే తెలియదు” అన్నారు.
ఉన్నవ చెప్పిన ‘రుచి’ ఎరిగినవాడు,
ఆ రుచి మరిగినవాడు విజయ్ కుమార్.
‘ఈది కులాయి ఈరోయిన్లు’ కతలో…
“ఈది కులాయికాడ రేగిన తగువుని ఇళ్లదాకా తీసకొచ్చుకోని… వున్నేట్టుండి ఇదిగోనే లంజా అంటా కోక పైకెత్తేసిందా పాపులు.
మా లచ్చువత్త మాతరం తక్కువ తిన్నాద్యా! నాదిగూడా ఇదిగోనే లంజా.. అంటా కోక పైకెత్తేసినాది. పెరుక్కోయా, నా మొగుడ్లంజా… అంటా ఇంకా ఒకరవ్వ కోక పైకెత్తినాది పాపులు. నువ్వొచ్చి పెరుక్కోయా బోగం లంజా.. అంటా లచ్చువత్త కూడా ఇంకోరవ్వ కోక పైకెత్తినాది.
కోకంతా పైకెత్తేసి పులిలాగా ముందరకి
దూకినాది పాపులు…
లచ్చువత్త కూడా కోకెత్తేస్కోని సింపం మాదిర్న లగిచ్చినాది. వాకిళ్ళలోంచి నడీదికొచ్చినాది తగువు” అని రాశాడు విజయ్.
(స్మైల్ ‘ఖాళీ సీసాలు’ కథేమన్నా గుర్తొచ్చిందా?)
బూతులతో ఇంత బీభత్సంగా రాసి, కమర్షియల్ హిట్టేమన్నా కొడదావని సొలోమోన్ ప్లాన్ చేశాడా?
లేదు. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ దేశం పల్లెల్లోని జనం, ఒక్క బిందెడు నీళ్ల కోసం ఇంత హేయంగా, నీచంగా, దీనాతిదీనంగా తిట్టుకుని, కొట్టుకుంటున్న దుర్గతికి అక్షర రూపం ఇచ్చాడు… అంతే!
*** *** ***
ఒక్క బిందెడు నీళ్ల కోసం, పంపుల దగ్గర ఆడవాళ్లు, అనరాని, వినలేని, రాయకూడని బండబూతుల్ని, మా ఏలూరులో ఏళ్ల తరబడి నేను విన్నాను. అలాంటి గుండె పగిలే విషాదాన్ని కేవలం రెండు పేజీల కథలో, చాచి కొట్టినంత effectiveగా రాశాడు.
స్పష్టత, క్లుప్తత – అనే రెండు మారణాయుధాలతో పాఠకుల్ని నిముషాల్లో హతమార్చే విద్యాపారంగతుడు విజయ్!
*** *** ***
గూడవల్లి రామబ్రహ్మం తీసిన పాత ‘మాలపిల్ల’ (1938) సినిమాలో ఒక సన్నివేశం…
ఆ గ్రామంలోని మాలవాళ్లు, ఈరోజు అటోయిటో తేల్చుకుందాం అని బయలుదేరతారు.
శాస్త్రి గారి ఇంటికి వెళతారు.
బైట పెద్ద గుంపుగా నించొని వుంటారు.
వాన జోరుగా కురుస్తూ వుంటుంది.
శాస్త్రి గారు పూజలో వుంటారు.
కూతురు, “నాన్నా వాళ్లు వచ్చారు” అంటుంది. దీక్షగా శివలింగానికి అభిషేకం చేస్తున్న శాస్త్రి గారు ఏమీ మాట్లాడరు.
కూతురు మళ్లీ అంటుంది, “వాళ్లు… తడుస్తున్నారు…”
“తడవనీ… మురికన్నా వదుల్తుంది”
అంటాడు మన శాస్త్రి గోవిందరాజుల సుబ్బారావు. ఈ సినిమాకి మాటలు తాపీ ధర్మారావు, కథ గుడిపాటి వెంకట చలం. ఇలాంటి అవమానాలు, చీత్కారాలు దళితులకు ఇప్పటికీ తప్పడం లేదు.
దళితులపై వివక్ష, దౌర్జన్యం, దమనకాండ యథేచ్చగా జరిగిపోతూనే వున్నాయి. గ్రామాల్లో దుర్మార్గాల్ని, ఆడవాళ్ల నిస్సహాయతనీ, బిడ్డల ఆకలినీ, చదువుకోలేని నిత్య దరిద్రాన్నీ రచయిత కొద్దిమాటల్లోనే, కొన్ని సంఘటనలతోనే మనం గతుక్కుమనేలా రాస్తాడు. నిరలంకారమైన
శైలిలో సాగే నిరుపమానమైన కథలివి.
*** *** ***
తెలుగులో చిన్న కథ అంటే, ముందుగా తలుచుకోవాల్సిన వాళ్లలో అతిముఖ్యుడు చాగంటి సోమయాజులు. చాసో గా ప్రసిద్ధుడు. ఆయన రాసిన కుంకుడాకు, ఎంపు, వాయులీనం. ఏలూరెళ్లాలి… కథలు మన సాహిత్యంలో మణిపూసలుగా వాసికెక్కాయి. చాసో తన మొత్తం జీవితంలో 23 కథలు మాత్రమే రాశారు. అగ్రతాంబూలానికి అర్హునిగా నిలిచిపోయారు. ఐరనీ ఏమిటంటే, సొలోమోన్ విజయ్ ‘మునికాంతపల్లి’లో 23 కథలున్నాయి. ఇది అతని తొలి కథాసంపుటి. ఈ సంకలనంతోనే, అనగా ఈ 23 కథలతోనే విజయ్, చాగంటి సోమయాజులు పొందినంత ప్రతిష్టనీ, ఖ్యాతినీ సొంతం చేసుకోగలిగారు.
Its not a mean achievement.
*** *** ***
తెలుగులో దళిత కథ అంటే యెండ్లూరి సుధాకర్, నక్కా విజయరామరాజు, చోరగుడి జాన్సన్, గోగు శ్యామల, మాదాసు వినోదిని, జూపాక సుభద్ర,
వి. చంద్రశేఖరరావు, బోయ జంగయ్య, కొలకలూరి ఇనాక్, చిలుకూరి దేవపుత్ర, కళ్యాణరావు, నాగప్పగారి సుందర్రాజు, పైడి తెరేష్ బాబు పేర్లు చప్పున గుర్తొస్తాయి.
భారతీయ కథా సాహిత్యంలో… వైకం మహ్మద్ బషీర్, ఇస్మత్ చుగ్తాయ్, సాదత్ హసన్ మంటో, కిషన్ చందర్… వంటి అనేకమంది సుప్రసిద్ధుల జాబితాలో సొలోమోన్ విజయ్ కుమార్ పేరుకూడా చేర్చాలేమో. లేదా ఆరోజెంతో దూరం లేదేమో!
*** *** ***
సొలోమోన్ విజయ్ కుమార్ అనే కథకుడు వచనం అనే మారువేషంలో మనమధ్య తిరుగుతున్న మద్దూరి నగేష్ బాబు!
గొంగడి కప్పుకుని గోప్యంగా సంచరిస్తున్న
గోరటి వెంకన్న!!
*** *** ***
ఇరగదీశావ్ కదరా ఇజియా!
నీ ఇరవై మూడు కథల కన్నీటికాల్వల్ని ఈది,
అగ్నిగుండాల్ని దాటి మళ్లీ మనిషిగా
పునర్జన్మించాను.
అంత విషాదాన్ని, బీభత్సాన్ని మామూలు మాటల్లో ఎలా పలికించగలిగావు?…
బాధల దాస్తో విస్కీ గాని తాగి రాశావా?
తల్లుల, అక్కల, ప్రియురాళ్ళ, వేశ్యల,
వదినల, నాయనమ్మల, పిన్నమ్మల
జీవన వ్యధని నెత్తురోడే
అక్షరాలుగా మార్చగల నైపుణ్యం నీకెక్కడిది?
కన్నీటి కత్తుల్ని గుండెల్లో దించగలిగే విద్య
ఎక్కడ నేర్చుకున్నట్టు?
అంత నైరాశ్యంలోనూ హాస్యాన్ని పట్టుకోగలిగే
గుండెనిబ్బరం ఎలా సాధ్యమైంది నీకు?
నీ బాధల జీవనది ‘సొర్నముకి’లో ఇపుడే మూడుసార్లు మునిగి పునీతుణ్ణి అయ్యాను. ఆడవాళ్ల బాధలు ఆడాళ్ళకే తెలుస్తాయన్నట్టు, మాలోళ్ళ కష్టాలు మాలోళ్ళే రాయాలేమో అన్పించింది నీ కథలు చదివితే!
చలించిపోవడం మాత్రమే కాదు,
రక్తాశ్రుబిందువుగా ఘనీభవించిపోయాను.
బతుకుని దహించివేసే కష్టాల్ని ధైర్యంగా దిగమింగినవాడివి. భాషా సౌందర్య రహస్యం తెల్సినవాడివి. పేదజనం జీవద్భాషా మాధుర్యాన్ని వాక్యనిర్మాణ చాతుర్యంతో మా దోసిలి నింపినవాడివి! అతి సామాన్యుల పలుకుబడిలోని నిజాయితీ, నిర్భీతి, అమాయకత్వం, సత్యసంధత, శూలాల్లా గుచ్చుకునే సూటిదనంలోని సౌందర్యాన్ని పట్టుకోగల హృదయం నీది.
చేవగల కథకుడివి!
మా పెంచిలవ్వ, ఫాతిమా, దేవగన్నిక సిత్ర, ఈరో నాగార్జిన గోడ్ని బళ్ళో యాస్తుండారు… ఇలా ఏ కథ అయినా… మొదటి వాక్యంతోనే వూబిలోకి దింపేస్తావు. ముగింపు అనే బాకుని
గుండెల్లో దింపి చంపేస్తావు.
దొంగవి నువ్వు!
నవ్వుతూనే చేదు విషాన్ని గొంతులో వొంపుతావు, పైగా పేదరికం మీకేం తెలుసురా చదువుకున్న నాయాళ్ళారా అని తిట్టకుండా వూరుకుంటావు. నువ్వు రాసినవి మట్టిగొట్టుకుపోతున్న వొట్టి కథలు కానేకావు. చీమూనెత్తురూ వున్న జీవన వాస్తవాలు.
అవి దళిత మాగ్నకార్టా కి ముందుమాటలు!
పీడితుల వేదనలకి ప్రియాంబుల్!
నా ప్రియమైన దేశద్రోహీ!
ఈ దేశంలో ఏ సాహిత్య అవార్డుకీ
నిన్ను పొందగలిగే అర్హత లేదు!
తమ్ముడా! Solo మొనగాడా!
‘కిటుకు’ తెలిసిన కొంటెవాడా!
ఐనా… నీ కథల…
కడలితరగ లాపగలరా
భడవలు కాన్యుట్ లు!
*** *** ***
అలెక్స్ హేలీ రాసిన ‘మాల్కం ఎక్స్’ ఆత్మకథ చదివి, ఒక విదేశీ జర్నలిస్టు – “A great book… its dead level honesty, its passion, its exalted purpose, will make it stand as a monument to the most painful truth” అన్నాడు.
ఈ మాట సొలోమోన్ కథల పుస్తకానికీ వర్తిస్తుంది.
***
సంజాయిషీ :
మెచ్చుకునీ, భుజం తట్టీ, ఇలా పొగడడం వల్ల కథకుడు విజయ్ కుమార్ కొత్తగా పాడయ్యేదేమీ లేదనే అనుకుంటున్నాను. బాగా, ఇర్రిపేరబుల్ గా పాడయ్యి, అనగా ‘ సర్వభ్రష్ట ‘ అయినవాడు మాత్రమే ఇంత మెలాంఖలీ ని పలికించగలడనీ, SUBLIME అనే సౌందర్య శిఖరం అంచుల్ని అందుకోగలడనీ అనుకుంటున్నా.
-తాడి ప్రకాష్