చింతూరు మన్యంలో మోతుగూడెం పోలీసులు 100కేజీల గంజాయిని శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. ఈ గంజాయికి సంబంధించిన వివరాలను చింతూరు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో చింతూరు అదనపు ఎస్పీ పంకజ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్లోని మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఈ వాహన తనిఖీలు నిర్వహిస్తుండుగా డొంకరాయి వైపు నుండి చింతూరు వైపు వస్తున్న టీఎస్08ఈహెచ్0756 మారుతి స్విప్ట్ కారును ఆపి తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా చింతూరు మండలం తూలుగొండ గ్రామానికి చెందిన కరణం రామాంజనేయులు, ఆదే గ్రామానికి చెందిన అరెళ్ల బోజ్జిలు ఇరువురు కలసి కారులో తరలిస్తుండుగా పట్టుకున్నామన్నారు. ఈ కారులో మొత్తం 100కేజీల గంజాయి ఉందని ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.5లక్షల వరకు ఉంటుందని బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుందన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు గంజాయి అమ్మిన ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరికి చెందిన చెందిన కొవాసి తాతరావు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకి చెందిన షేక్ సుబ్బానీలపై కేసు నమోదు చేశామన్నారు. పోలీసులకు దొరికిన ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.
గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని చింతూరు అదనపు ఎస్పీ పేర్కొన్నారు. కొవాసి తాతరావుపై డొంకరాయి, చింతూరు పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు ఉన్నాయని, కరణం రామాంజనేయులుపై చింతూరు పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు, షేక్ సుబ్బానీపై చింతూరు పోలీస్ స్టేషన్ లో ఒక గంజాయి కేసు ఉందన్నారు. ఈ నలుగురు గంజాయి అక్రమ రవాణాకు గ్యాంగ్గా పనిచేస్తున్నారన్నారు.