మన దేశంలోని మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 17 మంది బిలియనీర్లు, 28% మంది నేరచరితులు ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. లోక్సభలోని 75 మంది మహిళా ఎంపీల్లో ఆరుగురు, రాజ్యసభలోని 37 మంది మహిళా ఎంపీల్లో ముగ్గురు, రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లోని 400 మంది మహిళా ఎమ్మెల్యేల్లో 8 మంది తమను తాము బిలియనీర్లుగా ప్రకటించుకున్నట్టు వెల్లడించింది.
మొత్తం 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 512 మంది ఎన్నికల అఫిడవిట్లు సమర్పించారని, వారిలో 143 (28 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది. లోక్సభ మహిళా ఎంపీల్లో 24 (32 శాతం) మంది, రాజ్యసభ మహిళా ఎంపీల్లో 10 (27 శాతం) మంది, మహిళా ఎమ్మెల్యేల్లో 109 (27 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 78 మంది మహిళా చట్టసభ సభ్యులు హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని, వారిలో 14 మంది లోక్సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు పేర్కొన్నది.