ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 48 మంది పౌరులు మరణించగా, వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్-అమెరికన్ బందీని విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం.
మరోవైపు, గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇటీవల ఇజ్రాయెల్పై హూతీలు జరిపిన దాడుల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హూతీలను కచ్చితంగా ఎదుర్కొంటామని, గతంలో ఐడీఎఫ్ చేసిన దాడులను వారు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయని, బాంబుల మోతలతో హోరెత్తిస్తామని ఆయన అన్నారు.
హమాస్- ఇజ్రాయెల్ మధ్య రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హమాస్ తన చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తుండగా, ప్రతిగా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేస్తోంది. ఇప్పటివరకు హమాస్ తన తాజా ఒప్పందంలో భాగంగా మొత్తం 22 మంది ఇజ్రాయెల్ వాసులను విడుదల చేసింది. అయితే, బందీల విడుదల ఆలస్యంపై అమెరికా అధ్యక్షుడుహమాస్ కు డెడ్ లైన్ విధించారు. వారిని త్వరగా విడుదల చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.