ప్రజా పంపిణీ వ్యవస్థలో గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (రేషన్ వాహనాలు) వ్యవస్థను రద్దుచేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జూన్ 1 నుంచి లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిశ్చయించింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రం ఇంటికే డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది.
గత వైసీపీ ప్రభుత్వం 9,260 ఎండీయూ వాహనాల కొనుగోలుకు రూ.1,860 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని.. పైలట్ ప్రాజెక్టు కోసం మరో రూ.200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ వాహనాల వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోగా.. బియ్యం అక్రమ రవాణాకు దారితీసిందన్నారు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ప్రకారం 25 శాతం మందికి నిత్యావసర సరుకులు అందకపోవడం, 26 శాతం మంది ఎండీయూ ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దొంగ లెక్కలు చూపించి వాహనాలను దారి మళ్లించారని.. ఒక్కొక్క వాహనానికి నెలకు 27 వేలు కార్పొరేషన్ నుంచి చెల్లిస్తున్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈబీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఎండీయూ వాహనాలు పొందిన వారిలో 10 శాతం కట్టిన వారికి ఈ వాహనాలను ఉచితంగా అందజేయాలని మంత్రిమండలి నిర్ణయించిందన్నారు. రేషన్ కార్డుల్లో పేరు చేర్చడం కోసం దాదాపు మూడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయని.. కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడంతో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70 వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యాన్ని కూటమి ప్రభుత్వం సీజ్ చేసిందని తెలిపారు.