ఉరుములు, మెరుపులతో కూడిన కారుమబ్బులు. విమానం అలాగే ముందుకు చొచ్చుకువెళితే అందులోని ప్రయాణికులందరికీ ప్రమాదం పక్కకు వెళదామంటే పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లక తప్పని పరిస్థితి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో- సునాయాసంగా పక్కదేశ గగనతలంలోకి వెళ్లలేని దుస్థితి. .. అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో- విమానాన్ని పాకిస్థాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్థాన్ అధికారుల పాషాణ హృదయం కరగలేదు. విమానాన్ని అనుమతించడానికి ససేమిరా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో పైలట్లు ఆ లోహవిహంగాన్ని ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానతో కూడిన కారుమబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఈ క్రమంలో అది తీవ్ర కుదుపులకు లోనైంది. ప్రమాదపుటంచులకు చేరువైంది. వేల అడుగుల ఎత్తునుంచి అత్యంత వేగంగా కిందకు జారడం మొదలైంది. విమానంలోని ఒక్కొక్క వ్యవస్థా మొరాయించసాగాయి. వడగళ్లు అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి. భారీ కుదుపులకు ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్యసాహసాలతో విమానాన్ని ముందుకు నడిపించారు. చాకచక్యంతో కిందికి దించారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరిన ఇండిగో 6ఇ 2142 విమాన ప్రయాణికుల భీతావహ అనుభవం ఇది. ఈ ఘటనపై భారత పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ఒక సవివర ప్రకటన విడుదల చేసింది.
• శ్రీనగర్కు చేరే క్రమంలో పఠాన్ కోట్ వద్ద ఈ విమానానికి ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో నిర్దేశిత ప్రయాణ మార్గానికి ఎడమవైపునకు (అంతర్జాతీయ సరిహద్దు దిశగా) మళ్లడానికి అనుమతించాలని వైమానిక దళానికి చెందిన నార్తర్న్ కంట్రోల్క పైలట్లు విజ్ఞప్తి చేశారు. ఇలా వెళ్తే విమానం కొద్దిసేపు పాక్ గగనతలంలో ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఇండిగో పైలట్ల విజ్ఞప్తిని నార్తర్న్ కంట్రోల్ తిరస్కరించింది.
• భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తూ పాక్ పౌరవిమానయాన అధికారులు ఇచ్చిన ‘నోటమ్’ను గుర్తుచేస్తూ ఇండిగో సిబ్బందికి ఆ సూచన చేశామని వైమానిక దళ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆ విమాన ప్రయాణ మళ్లింపు ప్రణాళికపై సమన్వయం చేసుకోవడంలో తాము సాయం అందించినట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో దిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో మాట్లాడామని, లాహోర్ ఏటీసీని సంప్రదించడానికి అవసరమైన ఫ్రీక్వెన్సీలను ఇండిగో సిబ్బందికి అందజేశామని తెలిపాయి.
• దీనిప్రకారం ఇండిగో విమాన పైలట్లు.. లాహోర్ ఏటీసీని నేరుగా సంప్రదించారు. ప్రతికూల వాతావరణం కారణంగా పాక్ గగనతలంలో కొద్దిసేపు ప్రయణించేందుకు అనుమతి కోరారు. అటువైపు నుంచి తిరస్కరణ ఎదురైంది.