టిడిపి కూటమి సర్కారు ఎండియు వ్యవస్థ ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరాకు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంతో మంగళం పాడేసింది. ఈ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీలకు రేషన్ కష్టాలు మళ్లీ మొదటకే రానున్నాయి. డిపోల నుంచి రేషన్ సరుకులను తీసుకుని, నెత్తిన పెట్టుకుని దూర ప్రాంతాల్లోని వారి గ్రామాలకు కాలినడకన వెళ్లాల్సిందే. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోల ద్వారా బియ్యం సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్త్రీ శిశు, సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గత ఏడాది ప్రకటించారు. అప్పట్లో ఆమె నిర్ణయాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇంటింటికీ ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరఫరా కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం వెనక్కితగ్గింది. కొన్ని మాసాలపాటు ఎండియు వ్యవస్థపై మిన్నకున్న టిడిపి కూటమి ప్రభుత్వం ఇప్పుడు డిఆర్ డిపోల ద్వారానే రేషన్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల నుంచి డిపోల ద్వారా సరుకులు సరఫరాపై ప్రభుత్వం నుంచి పౌరసరఫరాల శాఖ, గిరిజన సహకార సంస్థ అధికారులకు సంకేతాలు అందాయి.
అల్లూరి జిల్లాలోని డిఆర్ డిపోల పరిధిలో రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు ఎండియు వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేయడంతో చాలామంది లబ్ధిదారులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గత నాలుగేళ్లలో ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఇంటింటికీ రేషన్ సరఫరాపై సంతృప్తి చెందారు. గతంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరా చేపట్టక మునుపు డిఆర్ డిపోల ద్వారా రేషన్ సరఫరా చేసినప్పుడు తమ గ్రామాల నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు వెళ్లి కాలినడకన రేషన్ సరుకులు మోసుకుని తెచ్చుకునేవారిమని, చాలా వ్యయ ప్రయాసలకు ఎదుర్కొనేవారిమని పలు గ్రామాల గిరిజనులు గుర్తుచేసుకుంటున్నారు. గత వైసిపి ప్రభుత్వం రేషన్ సరుకుల సరఫరాకు 2021 నుంచి ఎండియు వాహనాల సేవలను అందుబాటులోకి తేవడంతో తమకెంతో సౌలభ్యం చేకూరిందని వారు తెలిపారు. వాస్తవానికి అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలలో 2,98,092 మంది రేషన్ కార్డుదారులకు 221 మొబైల్ డిస్పెన్సివ్ యూనిట్స్ (ఎండియు) వాహనాల ద్వారా ఇంత వరకూ సరుకుల సరఫరా జరిగింది. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో రేషన్ సరఫరా చేస్తే పాడేరు డివిజన్లోని 336 డిపోలు, చింతపల్లి డివిజన్లోని 156 డిపోల పరిధిలో ఉండే వందలాది గ్రామాల గిరిజనులు అవస్థలు పడనున్నారు.