సెబీ మాజీ చీఫ్ మాధవిపురి బచ్కు లోక్పాల్ క్లీన్చిట్ ఇచ్చింది. మాధవిపురిపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్న లోక్పాల్, అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొంది. అంతేకాదు ఆమెపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేసింది.
హిండెన్బర్గ్ ఆరోపణలు: సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్పై అమెరికా షార్ట్సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది.
‘నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ ఛైర్పర్సన్ మాధబితో అదానీ సంస్థల సంబంధాలను చూస్తే ఇది బాగా అర్థం అవుతుంది. విజిల్బ్లోయర్ పత్రాల ప్రకారం, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నాయి. ఇందులో మాధబి పురి, ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాలు ఉన్నాయి’ అని హిండెన్బర్గ్ తన తాజా నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని తెలిపింది. అయితే హిండెన్బర్గ్ వ్యాఖ్యలపై సెబీ ఇంకా స్పందించలేదు.
హిండెన్బర్గ్ ఆరోపణల ఆధారంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గతేడాది లోక్పాల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో బచ్ దంపతులు స్పందించారు. మార్కెట్ నియంత్రణ సంస్థ విశ్వసనీయత, వ్యక్తిత్వ హననానికి షార్ట్ సెల్లర్ సంస్థ పాల్పడుతోందని ప్రత్యారోపణలు చేశారు. అదానీ గ్రూప్ కూడా హిండెన్బర్గ్ ఆరోపణలను దురుద్దేశంతో కూడినవిగా పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన లోక్పాల్ తాజాగా తీర్పు వెలువరించింది. సెబీ మాజీ చీఫ్పై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేవంటూ కొట్టిపారేసింది. 2022 మార్చి 2న సెబీ చీఫ్గా బాధ్యతలు చేపట్టి మాధవి పురి బచ్, ఈ ఏడాది ఫిబ్రవరి 28న గడువు పూర్తవ్వడంతో తన బాధ్యతల నుంచి వైదొలిగారు.