ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ యుద్ధ విమానాలు కూలినట్లు పాకిస్థాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై ఇవాళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్(CDS Anil Chauhan) రియాక్ట్ అయ్యారు. బ్లూమ్బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధ విమానాల కూల్చివేత ప్రశ్నకు స్పందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలు కూలిన మాట వాస్తవమే అని అంగీకరించారు. కానీ ఎన్ని యుద్ధ విమానాలు కూలాయన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. యుద్ధ విమానం కూలిందా అన్న అంశం ముఖ్యమైంది కాదు అని, ఎందుకు కూలయన్నదే కీలక అంశం అవుతుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
ఆరు యుద్ధ విమానాలు కూల్చినట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కానీ సంఖ్య విషయంలో ఆయన స్పష్టతను ఇవ్వలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన వ్యూహాత్మక లోపాల్ని గుర్తించగలిగామని, దాన్ని పరిష్కరించామని, ఆ తర్వాత రెండు రోజుల్లోనే మళ్లీ రంగంలోకి దిగామని, మన యుద్ధ విమానాలను శత్రవులపై దింపామని, లాంగ్ రేంజ్ టార్గెట్లను కూడా చేధించామని చౌహాన్ తెలిపారు.
యుద్ధ విమానాలపై భారతీయ ప్రభుత్వ అధికారి లేదా సైనిక అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ను చేపట్టారు. పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. అయితే ఆ ఆపరేషన్ సమయంలో మన యుద్ధ విమానాలు నేలకూలినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. పాకిస్థాన్ మాత్రం అయిదు విమానాలను కూల్చినట్లు పేర్కొన్నది. కూలిన వాటిల్లో మూడు రఫేల్స్, ఓ సుఖోయ్, ఓ మిగ్ ఉన్నట్లు పాక్ మీడియా ఆ రోజున కొన్ని కథనాలు రాసింది. అయితే ఆ ఆపరేషన్లో విమానాలు కోల్పోయినట్లు సీడీఎస్ అంగీకరించినా.. సంఖ్య ఎంత అన్న దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.