కవిత అంశం పైన ఎవరూ స్పందించ వద్దని పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కవిత టార్గెట్ చేస్తున్న వేళ కేటీఆర్ వ్యూహాత్మకంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. కవిత అంశం పైన హరీష్ తో పాటుగా కొందరు ముఖ్య నేతలతో మాత్రమే కేసీఆర్ స్పందించారు. ఇక, ఇప్పుడు హరీష్ ఇప్పటి వరకు కవిత చేస్తున్న కామెంట్స్ కు సమాధానం ఇచ్చారు. కవిత పదే పదే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం పైన స్పందించిన హరీష్ బీఆర్ఎస్ కు ఏ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఒంటరిగానే బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని.. కేసీఆర్ నాయకత్వంలోనే తామంతా పని చేస్తామని స్పష్టం చేసారు. ఎక్కడా కేటీఆర్ ప్రస్తావన చేయలేదు. కవిత చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదనే విధంగా హరీష్ క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేసి.. వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్బుక్లో పేర్లు రాసు కుంటామని పోలీస్, ఇతర అధికారులను హెచ్చరించారు. జాగ్రత్త , రాబోయేది తమ ప్రభుత్వమే నని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీ నే అని హరీష్రావు విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ను రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్నారని.. వీటి పనులను నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్ను ఆపాలని సవాల్ విసిరారు. బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్కు అనుమతి ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.