కర్ణాటకలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు బ్రాంచిలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి నింబార్గి మీడియాకు వెల్లడించారు. మే 26న కెనరా బ్యాంకు మేనేజర్ ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మే 23న సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారు. ఆ మరుసటి రెండు రోజులు మే 24, 25 తేదీల్లో (నాలుగో శనివారం, ఆదివారం) బ్యాంకు మూసి ఉంది. అయితే, మే 26న బ్యాంకు గుమస్తా వచ్చి క్లీన్ చేసేందుకు తెరవగా.. షట్టర్ తాళం కట్ చేసి ఉన్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించాక దొంగలు చొరబడినట్లు తేలింది. మొత్తంగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశాం అని ఎస్పీ వివరించారు. అయితే, చోరీ ఘటన మే 24, 25 తేదీల్లో రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే నిందితులను పట్టుకొని ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.