పార్లమెంట్, శాసనసభలు చేసే ఏ చట్టాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2012లో దాఖలైన Delhi యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ నందిని సుందర్ పిటిషన్ను విచారిస్తూ ఈ మేరకు తీర్పునిచ్చింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. “ప్రతి రాష్ట్ర శాసనసభకు ఒక చట్టాన్ని ఆమోదించే పూర్తి అధికారులు ఉంటాయి. ఆ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, న్యాయస్థానం చెప్పేంతవరకూ అది చట్టంగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇది రాజ్యాంగ విరుద్ధమని, కొట్టివేయాలని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. చట్టం చెల్లుబాటును, వివాదాలను పరిష్కరించే అధికారం రాజ్యాంగం ద్వారా న్యాయవ్యవస్థకు వచ్చింది” అని కోర్టు అభిప్రాయపడింది.
సల్వా జుడుం, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO) వంటి సాయుధ పౌర సమూహాలను మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వినియోగించడంపై అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు రేకెత్తాయి. ఛత్తీస్గఢ్ సర్కారు పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, సల్వా జుడుం రద్దు చేయాలని, నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, నక్సలైట్లు చేసిన నేరాలపై దర్యాప్తు చేయాలని నందిని సుందర్తో పాటు పలువురు 2007లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసారు.
జూలై 5, 2011న, సుప్రీంకోర్టు SPOలను ఉపయోగించకుండా ఆదేశాలను ఇచ్చింది. అదే ఏడాది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2011లో ఛత్తీస్గఢ్ సహాయక సాయుధ పోలీసు దళ చట్టాన్ని సవరించింది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సేవలను వినియోగిస్తోంది. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన చట్టం కోర్టు మునుపటి ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ 2012లో నందిని సుందర్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. ‘పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ చట్టాన్ని కూడా కోర్టు ధిక్కారంగా పరిగణించలేం. ఆ ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యంగ సూత్రాలకు విరుద్ధమని నిర్ధారణ కాకపోతే అది కోర్టు దిక్కారం కాదు’ అని ధర్మాసనం చెప్పింది.