ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం గత కొన్ని రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్క్ లో జరుగుతున్న ఆపరేషన్లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు రోజులుగా నేషనల్ పార్క్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ (Anti Naxal Operation) కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. సుధాకర్పై రూ. కోటి, భాస్కర్పై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి.
కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడ్ పర్వతాలతోపాటు నేషనల్ పార్కులో అణువణువూ జల్లెడ పడుతుండటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో మృతిచెందగా.. నేషనల్ పార్కులో ఇప్పుడు అగ్ర కమాండర్లు మరణిస్తున్నారు. ఇదే ప్రాంతంలో భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడా కూడా ఉన్నట్లు సమాచారం. అతడి లక్ష్యంగానే ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.