ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ రాబోతోంది. న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. బీసీఐ (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యూనివర్సిటీ న్యాయ విద్యకు, పరిశోధనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి బీసీఐ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇటీవల బీసీఐ అధ్యక్షుడు, ముఖ్య సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమైన సంగతి తెలిసిందే. అమరావతిలో బీసీఐ ఏర్పాటు చేయబోయే న్యాయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఉంటుంది. ఈ యూనివర్సిటీ న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యకు, నైపుణ్యాభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు. 1986లో బెంగళూరులో బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఎల్ఎస్ఐయూ (నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ), అలాగే ఐఐయూఎల్ఈఆర్ (ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) 2022లో గోవాలో ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలకు ఎంతో గొప్ప పేరు ఉంది. ఈ యూనివర్సిటీ రాకతో న్యాయ విద్య మరింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.