నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతలపహాడ్ గ్రామానికి చెందిన వస్కుల శ్రీనివాస్ ఉపాధి కూలీ నుంచి నేడు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వస్కుల నర్సింహ-సత్తమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వారికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుటుంబం కావడంతో పిల్లల చదువులు, జీవనం కోసం నిత్యం కష్టపడేవారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండేవారు. ప్రాథమిక విద్య సొంతూరులో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆరు నుంచి పది వరకు కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల, ఇంటర్ శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల, డిగ్రీ నిజాం కాలేజీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎమ్ ఉస్మానియా కాలేజీ హైదరాబాద్లో చదివారు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు తల్లిదండ్రులతో కలిసి కూలీ పనికి వెళ్లేవారు. చదువయ్యాక ప్రభుత్వ ఉద్యోగం కోసం పట్టుదలతో చదివారు.
ఆర్థికంగా అంతగా లేకపోవటంతో పోటీ పరీక్షలకు సొంతంగానే సన్నద్ధమయ్యేవారు. 2008, 2010, 2012లలో జూనియర్ సివిల్ జడ్జి, 2011లో పీపీ (ప్రభుత్వ న్యాయవాది) ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు పొందినా, ఇంటర్వ్యూలో రాణించలేకపోయారు. అయినా వెనకడుగు వేయలేదు. ఎట్టకేలకు 2012లో ప్రభుత్వ న్యాయవాదిగా విజయం సాధించారు. అప్పటి నుంచి 2022 వరకు నిజామాబాద్ కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహించారు. అనంతరం 2023లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఐదో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈటీవీ భారత్’తో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు సహజమని, అపజయం ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా, బయపడకుండా లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని పేర్కొన్నారు.