సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు జూన్ 13, 2025న బెయిల్ మంజూరు చేసి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఆయన సాక్షి టీవీలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఒక విశ్లేషకుడు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా జూన్ 9, 2025న హైదరాబాద్లోని తన నివాసంలో అరెస్టయ్యారు. ఈ వ్యాఖ్యలు ఆయన చేయలేదని, విశ్లేషకుడు చేసినవని సుప్రీంకోర్టు గుర్తించింది. కొమ్మినేని అరెస్ట్ అక్రమమంటూ దాఖలైన పిటిషన్ ని విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ల ద్విసభ్య ధర్మాసనం ఆయన వాక్ స్వాతంత్ర్యం, జర్నలిస్టిక్ హక్కులను పరిరక్షించాలని, ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని ఆదేశించింది. అయితే, విడుదలకు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.
“టీవీ డిబేట్ లో నవ్వినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం? ఆయన్ని వెంటనే విడుదల చేయండి. దిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్ట్ విధిస్తుంది” అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.