ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల్లో ఇరాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. టెహ్రాన్ లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. టెల్అవీవ్ దాడుల్లో షహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమయినట్లు తెలిపారు. 11 నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతుండడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
గ్యాస్ క్షేత్రాలపై దాడి ఆ దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ క్షిపణి ఓ నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో 29 మంది పిల్లలతో సహా 60 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్లోని గలిలీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ భవనంపై టెహ్రాన్ చేసిన ప్రతిదాడుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
శనివారం ఇరుదేశాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిస్సైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా… టెల్ అవీవ్పై ఇరాన్ అయిదు విడతల్లో వందల క్షిపణులను ప్రయోగించింది. రెండో రోజు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లోని పలు కీలక స్థావరాలు సహా నతాంజ్ అణు కేంద్ర ఉపరితల భాగం ధ్వంసమైంది. నేలమాళిగలో ఉన్న ఈ అణు శుద్ధి కేంద్రం ఇరాన్కు అత్యంత కీలకమైనది. టెహ్రాన్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రంలోనూ పేలుళ్లు సంభవించాయి.