కుటుంబసభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన వారిలో ఐదుగురు యువకులు గోదావరి నదిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఆదివారం నిర్మల్ జిల్లా బాసరలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన ప్రేమమ్ రారోడ్-సోనీ దంపతులు ఇరవై ఏళ్ల కిందట వచ్చి హైదరాబాద్ జీడిమెట్లలోని చింతల్లో స్థిరపడ్డారు. అక్కడే కిరాణాదుకాణం నడిపిస్తున్నారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి సోనీ కుమారులు రాకేశ్(20), మదన్(18), భరత్(16)తో పాటు ఆమె చెల్లెలి కుమారుడు వినోద్ (18), సమీప బంధువైన దిల్ సుఖ్ నగర్ కు చెందిన రితిక్(22) సహా మొత్తం 20 మంది ఆదివారం ఉదయం రైలులో వచ్చారు. దర్శనానికి ముందు పుణ్యస్నానాల కోసం గోదావరి మొదటిఘాట్కు చేరారు.
అక్కడి నుంచి పడవలో గోదావరి ఇసుక తిన్నెలకు పయనమయ్యారు. ఇటీవల కురిసిన వర్షానికి గోదావరిలో నీటిమట్టం పెరిగింది. పైగా ఆ ప్రాంతం నది మధ్యలో ఉండటంతో ప్రవాహం ఎక్కువగా ఉంది. అందరూ ఇసుక తిన్నెలకు ఆనుకొని వేర్వేరుగా స్నానాలు చేస్తుండగా రాకేశ్, మదన్, భరత్, రితిక్, వినోద్ ప్రవాహానికి కొట్టుకుపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గజ ఈతగాళ్లు స్పందించి నలుగురిని ఒడ్డుకు చేర్చి బతికించే ప్రయత్నం చేశారు. మదన్, రితిక్ అక్కడే చనిపోగా రాకేశ్, భరత్ భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయారు. నదిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయిన వినోద్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. సకాలంలో కాపాడే వారు లేకనే యువకులు చనిపోయారని మృతుల కుటుంబీకులు ఆందోళనకు దిగారు. భైంసా ఏఎస్పీ అవినాశకుమార్ నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. మృతుల్లో ఒకరైన భరత్ ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు.