ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారణ ముగిసింది. కేటీఆర్ ను ఇవాళ ఉదయం నుంచి దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలను ఏసీబీ (ACB) సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. పార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించడం ఇది రెండో సారి. ఎఫ్ఎస్ఈవో కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, కేబినెట్ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు మళ్లించారన్న అంశాలపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఏసీబీ ప్రశ్నలకు బదులిస్తూ హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఎస్ఈవోకు పంపామని ఇందులో తాను ఎక్కడా లబ్ది పొందలేదని కేటీఆర్ దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ల వ్యవహారం అంతా అధికారులే చూసుకున్నారని, స్పాన్సర్లు వెనక్కి తగ్గడంతో హెచ్ఎండీఏ నిధులతో ఫీజులు చెల్లించామని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో కేటీర్ ను అరెస్టు చేయబోతున్నారనే టాక్ ఉదయం నుంచి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఏసీబీ మాత్రం కేటీఆర్ ను ప్రశ్నించి బయటకు
పంపింది.