మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రంలోని మోదీ సర్కారు క్రమంగా పాతరేస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రకాల ఆంక్షలు విధిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. తాజాగా మరో కొర్రీ పెట్టింది. పథకానికి కేటాయించిన నిధులను ఖర్చు చేసే విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిమితులను విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తంలో 60 శాతం వరకు మాత్రమే మొదటి ఆరు నెలల్లో ఖర్చు చేయాలని తెలిపింది. దీనిపై ప్రజా సంఘాలు, ఈ పథకం లబ్ధిదారుల సంఘాలు, విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, కొన్ని సంవత్సరాలుగా ఈ పథకానికి కేటాయించిన వార్షిక బడ్జెట్లో దాదాపు 70 శాతానికిపైగా సెప్టెంబరునాటికే ఖర్చయిపోతున్నది. డిసెంబరులో అనుబంధ కేటాయింపులు జరిపినప్పటికీ, జనవరికల్లా ఖర్చయిపోతున్నాయి. ఫలితంగా ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి బాకీలు పెండింగ్లో పడుతున్నాయి. గడచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో పెండింగ్ బాకీలు రూ.15,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల మధ్యలో ఉంటున్నాయి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో కేటాయించే బడ్జెట్లో సగటున 20 శాతం వరకు ఈ బాకీల చెల్లింపులకే సరిపోతున్నది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద ఖర్చులపై పరిమితి విధించడం ద్వారా ఆర్థిక సంవత్సరంలో రెండో సగ భాగానికి నిధులు అందుబాటులో ఉండేలా చేయవచ్చు. దీనివల్ల అదనపు కేటాయింపుల అవసరం ఉండదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం కేంద్రం రూ.86,000 కోట్లు కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బాకీలు రూ.21,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో 28 శాతం నిధులను కేంద్రం జూన్ 12 నాటికి విడుదల చేసింది. 2025-26లో బాకీలు రూ.3,262 కోట్లు, కేవలం ఈ బాకీలను చెల్లిస్తే, బడ్జెట్లో సుమారు 50 శాతం ఖర్చయిపోతుంది.
ఉపాధి హామీ పథకం కింద పని కోసం డిమాండ్ ఏడాది పొడవునా ఒకే విధంగా ఉండదు. వ్యవసాయ కార్యకలాపాలు, వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం, 2005 ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని అమలు చేసే విధివిధానాలను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంది. వార్షిక బడ్జెట్లో 60 శాతం పరిమితిని చేరుకున్న తర్వాత ఏం చేయాలనేదానిపై స్పష్టత లేదు. కూలీలు డిమాండ్ చేసినప్పటికీ ఉపాధిని నిరాకరించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకు రావచ్చు. లేదంటే, సకాలంలో చెల్లింపులు జరపకపోయినప్పటికీ పని చేయవలసిన పరిస్థితి కూలీలకు రావచ్చు. డిమాండ్ చేసిన 15 రోజుల్లోగా ఉపాధి పొందడం, పని పూర్తయిన తర్వాత 15 రోజుల్లోగా వేతనాలను పొందడం కూలీల హక్కులు. ఆర్థిక శాఖ నిర్ణయం వల్ల ఈ చట్టం స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది.