తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (MNC) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది. విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు మృతదేహాలు (క్యాడావర్), ప్రయోగశాలలు, క్లినికల్ పారామీటర్లు లేవని సీరియస్ అయింది. వసతుల లేమిపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇచ్చిన వివరణతో ఎన్ఎంసీ సంతృప్తి చెందలేదు. నిరుడు గుర్తించిన లోపాలను ఇప్పటికీ సరిదిద్దుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కాలేజీలకు రూ.2లక్షల నుంచి రూ.13 లక్షల వరకు జరిమానా విధించింది. వైద్య కళాశాల్లోని లోపాలపై చర్చించేందుకు ఈ నెల 18న ఢిల్లీలోని జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) కార్యాలయంలో నిర్వహించే విచారణకు వర్చువల్గా హాజరు కావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శితోపాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME ) శుక్రవారం ఆదేశించింది.
మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు ఉ న్నాయో లేదో ఎన్ఎంసీ పరిశీలిస్తుంది. ఈ ఏ డాది రాష్ట్రంలోని 35 కాలేజీల్లో తనిఖీలు చే సిన ఎన్ఎంసీ.. 26 కాలేజీల్లో వసతులు లేవని గుర్తించింది. ముఖ్యంగా విద్యార్థుల అటెండెన్స్, క్లినికల్ ట్రైనింగ్, మౌలిక సదుపాయాల్లో తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్టు తేల్చింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2025-26) ఆ కళాశాలను కొనసాగించాలో లేక రద్దు చేయాలో నిర్ణయించేందుకు విచారణకు హాజ రు కావాలని ఆదేశించింది. దీంతో 2,700 మెడికల్ సీట్లు ప్రమాదంలో పడనున్నాయి.
2014లో స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణలో 5 ప్రభుత్వ, 15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, వాటిలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో జిల్లాలో ఒకో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయించడంతో 2023 అక్టోబర్ నాటికి మొత్తం కళాశాలల సంఖ్య 56కు, సీట్ల సంఖ్య 8,340కి చేరింది. అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం మరో 8 కాలేజీలను మంజూరు చేయడంతో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 9,140కి పెరిగింది. కానీ, కేసీఆర్ సంకల్పానికి తూట్లు పొడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు.. వైద్య కళాశాలల్లో కనీసం వసతులు కల్పించలేని దుస్థితిలో ఉన్నది. మంత్రి రాజనర్సింహ రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీని కాపాడుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రతి కాలేజీలో మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
నిబంధనలు పాటించని 26 కాలేజీలు ఇవే..
ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, కుత్బుల్లాపూర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, వనపర్తి.
తక్షణమే నిధులు విడుదల చేయాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం. 26 మెడికల్ కాలేజీల్లో నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు, వసతులు లేకపోవడంపై ఈ నెల 18న ఎన్ఎంసీ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈకి తాఖీదులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఇంత ముఖ్యమైన విషయంపై సీఎం ఆలస్యంగా మేల్కొని, ఎట్టకేలకు సోమవారం ఓ కమిటీని వేయడం హాస్యాస్పదం. ఆ 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా? మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడాలి. వైద్యులు కావాలనుకుంటున్న విద్యార్థుల జీవితాలను నిలబెట్టాలి.