హైదరాబాద్ నగరంలో బోనాల సందడి షురూ అయింది. ఆషాఢ మాస బోనాలు ఈ నెల 26న గోల్కొండ బోనాలతో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ షాన్ అయిన గోల్కొండ నుంచే తొలి బోనం ప్రారంభమవుతుందని.. ఆషాఢ మాసం నెల రోజుల పాటు ఈ బోనాలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు పునరావృతం కాకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం దొరికిందని, దీన్ని బాధ్యతగా భావించి అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే బోనాల ఉత్సవాలకు నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు గోల్కొండలో జరిగే తొలి బోనం ఉత్సవాలలో పాల్గొనేలా చేయాలని, సమాచార ప్రసార శాఖ బోనాల ఉత్సవాల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. గోల్కొండ బోనాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా కోట కింద భక్తుల క్యూ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
GHMC శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని, అదనంగా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. షీ టీమ్లను ఏర్పాటు చేసి మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ విభాగం అప్రమత్తంగా ఉండాలని, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గోల్కొండకు నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేయాలన్నారు.