ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఇటీవలే ఏదాడి పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన మార్క్ను చూపిస్తోంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తు ప్రజల మన్నననలు పొందుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలోని ఆధాయ వనరులపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే రెవెన్యూ వసూళ్లలో గణనీయమైన పురోగతిని సాధించినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ వాణిజ్య పన్నుల వసూళ్లు అమితంగా పెరిగినట్టు తెలిపారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ వాణిజ్య పన్నుల వసూళ్లు 2025 ఏప్రిల్లో రూ. 906.12 కోట్లు వసూలు కాగా, మే నెలలో ఇది మరింత పెరిగి రూ. 916 కోట్లుకి చేరినట్టు అధికారులు తెలిపారు. అయితే గతేడాది (2024) ఇదే నెలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ వాణిజ్య పన్నుల వసూళ్లు రూ. 663.29 కోట్లు ఉండగా మే నెలలో రూ. 583 కోట్లు ఉన్నట్టు తెలిపారు. కాగా ఏడాది కాలంలో ఏప్రిల్లో రూ. 242 కోట్లు, మేలో రూ. 333 కోట్లు అధిక పన్నులు వసూలయ్యాయని స్పష్టమవుతోంది. అయితే రాష్ట్రంలో వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పన్నుల వసూళ్ల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, వేధింపులకు తావు లేకుండా పన్నుల వసూళ్లు జరపాలన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సేవలు ప్రజలకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని తెలిపారు. ఆదాయాన్ని పెంచేందుకు కొత్త మార్గాలు అన్వేషించాలన్నారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను దోపిడీకి వాడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రం మొత్తంలో ఆదాయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే కాక, ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల నుంచి అధిక ఆదాయం వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.24 లక్షల కోట్లు ఆదాయ అంచనాలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వాటిని సాధించగలిగితే అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయగలమని సీఎం స్పష్టం చేశారు.