ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే పిల్లలందరికీ హిందీ విధిగా బోధించాలని ఇటీవల మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తప్పనిసరి అనే పదాన్ని నోటిఫికేషన్ నుంచి తొలగించింది. ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బుధవారం మహారాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో ‘తప్పనిసరి’ అనే పదాన్ని తొలగించింది. హిందీకి బదులు మరో భాషను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు కల్పించింది. అయితే, ఆ భాష నేర్చుకోవాలనుకునే తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అప్పుడే ఆ సబ్జెక్టు పాఠశాలలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఆ భాషకు సంబంధించిన ఉపాధ్యాయుడి నియామకం కుదరకపోతే ఆన్లైన్ ద్వారా తరగతులు జరుగుతాయని వెల్లడించింది.
జాతీయ విద్యా విధానం(ఎన్ఎస్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. ఈ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హిందీని తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’ (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో పాటు ఉద్ధవ్ ఠాక్రే నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో దీనిపై పోరాడేందుకు ఠాక్రేలు ఏకం కానున్నారనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.