ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య యుద్ధం తీవ్రమవుతుండటంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ను విడిచిపెట్టి అర్మేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకోనుంది. ఇందులో 90 మంది కశ్మీర్కు చెందిన విద్యార్థులు ఉన్నారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్లోని భారతీయులను తరలించేందుకు, కొందరిని ఇరాన్లోని సురక్షిత ప్రాంతాలకు పంపేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అర్మేనియా చేరుకున్న భారతీయ విద్యార్థులను దోహాకు తరలించారని, అక్కడి నుంచి విమానంలో న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారని జమ్మూకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ విమానం బుధవారం రాత్రి 10.15 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది.
ఇరాన్లో 4,000 మంది భారతీయులుండగా, వారికి సగం మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలోనూ ఎక్కువ మంది జమ్మూకశ్మీర్కు చెందిన వారున్నారు. వీరు ప్రధానంగా మెడికల్, ఇతర వృత్తివిద్యా కోర్టులు చేస్తున్నారు. ఇరాన్లోని ఉర్మియా మెడికల్ యూనివర్శిటీలో ఎక్కువ మంది విద్యాభ్యాసం చేస్తున్నట్టు జమ్మూ అండ్ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది. ఇరాన్లోని ఎన్ఆర్ఐలతో అక్కడి భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదిస్తోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.