లోక్సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న రాహుల్ డిమాండ్ సరైందికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950/1951లో నిర్దేశించిన చట్టపరమైన స్థితికి, సుప్రీంకోర్టు ఆదేశాలకు ఇది విరుద్ధమని పేర్కొంది.
పోలింగ్ సమయంలోని వీడియో ఫుటేజ్ను బయట పెట్టడం ప్రజాప్రతినిధుల చట్టం ఉల్లంఘన కిందికి వస్తుందని, పైగా ఓటు వేయడం, ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని ఈసీ పేర్కొంది. సదరు వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమేనని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతామని స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత ఆయా వీడియో ఫుటేజ్లను తొలగించడం సాధారణ ప్రక్రియేనని ఈసీ క్లారిటీ ఇచ్చింది.
ఏదైనా సమూహం లేదా వ్యక్తి, ఓటర్లను సులభంగా గుర్తించడానికి వీలుగా ఫుటేజ్ను బహిర్గత పర్చడంవల్ల ఓటు వేసిన ఓటర్లు, ఓటు వేయని వారు ఇద్దరూ సామాజిక వ్యతిరేకుల ఒత్తిడి, వాళ్ల నుంచి వివక్ష, బెదిరింపులకు గురవుతారని తెలిపింది. అంతేకాదు, ఉదాహరణకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్ట బూత్లో తక్కువ ఓట్లు వస్తే, CCTV ఫుటేజ్ ద్వారా ఏ ఓటరు ఓటు వేశారో, ఏ ఓటరు ఓటు వేయలేదో సులభంగా గుర్తించగలుగుతుంది. ఆ తర్వాత, ఓటర్లను వేధించవచ్చు లేదా బెదిరించవచ్చని చెప్పింది.
కాగా, తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజీలను బహిరంగ పర్చాలని రాహుల్, కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాహుల్ డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, ఎన్నికల ఫలితంపై 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే సదరు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ కెమెరా రికార్డింగ్లు, వెబ్ కాస్టింగ్ , వీడియో ఫుటేజ్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు మే 30న ఎన్నికల సంఘం లేఖలు పంపింది. ఈ నేపథ్యమే ప్రస్తుత చర్చకు దారితీసింది.
అయితే, ఈ విషయంపై రాహుల్ గాంధీ తన స్టాండ్ను పలు సందర్భాల్లో సమర్ధించుకుంటున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ప్రజాస్వామ్యం రిగ్గింగ్కు గురైందని ఆరోపిస్తున్నారు. బీజేపీ ఓడిపోయే అవకాశం ఉన్నప్రతి చోట ఇలాగే జరుగుతోందని.. త్వరలో బీహార్లోనూ ఆ పార్టీ ఇదే చేయబోతుందని రాహుల్ జోస్యం చెబుతున్నారు.