ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలోకి (Israel Iran War) అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై బీ-2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై మేము విజయవంతంగా దాడులు చేశాం. వాటిలో ఫార్దో, నంతాజ్, ఇస్ఫహాన్ కూడా ఉన్నాయి. ఫోర్డో పై భారీ బాంబులు ఫార్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా సైనికులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’ అని తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్లో పోస్టు చేశారు.
అదేవిధంగా ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇరాన్ శాంతిని నెలకొల్పాలని, తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరారు. టెహ్రాన్ ప్రతి దాడులకు దిగేతే తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. కాగా, ఇరాన్పై దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఆయన మాట్లాడారు. అయితే ఫోర్డో అణు స్థావరంపై దాడులకు ఆరు బంకర్ బస్టర్ల బాంబులను, 30 టొమాహాక్ క్షిపణులను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అమెరికా దాడులను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఫోర్డో అణు స్థావరం లక్ష్యంగా తమ శత్రువులు వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారులు టాస్మిన్ న్యూస్ ఏజెన్సీకి వెల్లడించారు. నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు తెలిపారు. కాగా, ఇరాన్పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమపై టెహ్రాన్ ప్రతిదాడులకు పాల్పడవచ్చనే అంచనాతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కార్యాలయాలను మూసివేసింది. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగడానికి అనుమతించింది.