ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై (ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్) అమెరికా నిర్వహించిన “ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్” దాడిలో 125 యుద్ధ విమానాలతో పాటు 7 B-2 స్టెల్త్ బాంబర్లు పాల్గొన్నాయి. ఈ దాడిలో 14 జీబీయూ-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (బంకర్ బస్టర్) బాంబులు, 30కి పైగా టోమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ ఉపయోగించారు. జూన్ 22, 2025న జరిగిన ఈ ఆపరేషన్లో ఫోర్డో, నటాంజ్లపై 6:40 PM నుంచి 7:05 PM (EST) మధ్య బాంబులు వేయగా, ఇస్ఫహాన్పై టోమాహాక్ మిసైల్స్ చివరిగా దాడి చేశాయి. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమానికి తీవ్ర నష్టం కలిగించాయని, మూడు సైట్లూ “తీవ్రంగా ధ్వంసమయ్యాయి” అని పెంటగాన్ ప్రకటించింది.
ఇరాన్ యుద్ధ విమానాలు గానీ, రక్షణ వ్యవస్థలు గానీ అమెరికా విమానాలను గుర్తించలేకపోయాయని, దాడి సమయంలో ఎటువంటి ప్రతిదాడి జరగలేదని జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కైన్ తెలిపారు. ఈ ఆపరేషన్ను రహస్యంగా, కొద్దిమందికి మాత్రమే తెలిసేలా ప్లాన్ చేశారని, ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద B-2 దాడిగా నిలిచిందని పెంటగాన్ వెల్లడించింది.