భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ‘యాక్సియం-4’ (Axiom -4) మిషన్లో భాగంగా శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్-9 రాకెట్ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్కు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా శుభాన్షు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కారు. ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.