హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్తులు పంచుకొని తల్లిని ఇంటి నుంచి గెంటేసారు. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కుమారుల ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మూసారాంబాగ్కు చెందిన శకుంతలా బాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణించినప్పటి నుంచి ఆమె కొడుకుల వద్దే ఆమె ఉంటున్నారు. అయితే, ఆమె ఆలనాపాలనా చూడాల్సిన ఇద్దరు కుమారులు నిర్లక్ష్యం చేయడమే కాకుండా బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో దిక్కుతోచని శకుంతలా బాయి సైదాబాద్లోని తన చిన్న కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతున్నారు.
కుమారులు తనను పట్టించుకోవడం లేదని, తన ఇంటిని తనకు తిరిగి స్వాధీనం చేయాలని కోరుతూ శకుంతలా బాయి గత ఫిబ్రవరిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీవోను ఆశ్రయించారు. ఆర్డీవో జోక్యం చేసుకొని కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంటిని తల్లికి అప్పగిస్తామని ఆ సమయంలో కుమారులు అంగీకరించినప్పటికీ నెలలు గడుస్తున్నా వారు ఇంటిని ఖాళీ చేయలేదు. దీంతో సైదాబాద్ తహశీల్దార్ జయశ్రీ మూడు రోజుల క్రితం బాధితురాలి కుమారులకు తుది నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఇంటిని ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. గడువు ముగియడంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి తహశీల్దార్ ఆ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే కుమారులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఒక హెచ్చరికగా నిలిచింది.