రాజమహేంద్రవరంలో రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘అఖండ గోదావరి’ పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 26, 2025న శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంఖుస్థాపన చేశారు. వారితో పాటు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అమలు కానుంది. ఇది గోదావరి ప్రాంతానికి అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణ కల్పించే లక్ష్యంతో రూపొందించబడింది. రానున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ప్రణాళిక రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) కింద రాజమండ్రిలోని పుష్కరాల రేవు, 127 సంవత్సరాల చరిత్ర వున్న హేవలాక్ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలోని బ్రిడ్జిలంక (హేవలాక్ రైలు వంతెన, రోడ్ కం రైల్వే బ్రిడ్జి మధ్య ప్రాంతం)ను వినోద కేంద్రంగా మార్చనున్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఫలితంగా ఏడాదికి సగటున 18 నుంచి 20 లక్షల మంది పర్యాటకూ వస్తారని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేస్తుంది. స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణ, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.