తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను ఈ నెల (జూన్) 30వ తేదీ లోపు నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేపడతామని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (TJDA) ప్రకటించింది. ఇప్పటికే ఓసారి సమ్మె చేసేందుకు ప్రయత్నించగా.. ప్రభుత్వం చర్చలు జరిపి తాత్కాలికంగా విరమింపజేసింది. అయితే ప్రస్తుత పరిణామాలతో ప్రభుత్వానికి మరోసారి తలనొప్పి తప్పేలా లేదు.
2024 నవంబర్ నుండి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని TJDA సభ్యులు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)కు సమ్మె నోటీసును అందజేశారు. జూడాలకు చెల్లించాల్సిన స్టైఫండ్స్, ఇతర బకాయిలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయిని.. జనవరి నుండి పెండింగ్లో ఉన్న బకాయిల తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా, ప్రతినెల స్టైఫండ్లు సకాలంలో అందేలా ఒక పటిష్టమైన విధానాన్ని (గ్రీన్ ఛానల్) ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కొన్ని వైద్య కళాశాలల్లో జూనియర్ డాక్టర్లకు సరైన వసతి సౌకర్యాలు లేవని అలాగే ఆసుపత్రుల్లో వారికి భద్రత కరువైందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. వైద్య రంగంలో నిపుణుల కొరతను తీర్చడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచాలని కూడా జూడాలు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే జూన్ 30 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని TJDA హెచ్చరించింది. ఈ సమ్మెలో అత్యవసర సేవలు తప్ప, మిగిలిన అన్ని సేవలను బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.
కాగా, జూనియర్ డాక్టర్ల నిర్ణయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జూడాలు సమ్మెకు దిగితే.. రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్న తరుణంలో ఈ సమ్మె హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఈ సమ్మె నోటీసుపై ఎలా స్పందిస్తుందో, జూడాల డిమాండ్లను నెరవేర్చి సమ్మెకు వెళ్లకుండా అడ్డుకుంటుందో వేచి చూడాలి మరి.