బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టుల వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. తనపై, తమ పార్టీ నాయకత్వంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పదేపదే ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “జర్నలిస్టుల ముసుగులో కొందరు దుర్మార్గులు గత కొన్ని నెలలుగా నాపైనా, మా పార్టీ నాయకత్వంపైనా విషం చిమ్ముతున్నారు” అని ఆయన అన్నారు. ఇలాంటి వారి అభిప్రాయాలను, ఉనికిని తాను ఏమాత్రం ఖాతరు చేయనని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, ఈ నిరంతర వ్యక్తిగత దూషణల వల్ల తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ సహచరులు మానసికంగా వేదనకు గురవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తాను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఇలాంటి రాతలు రాస్తున్న ప్రతి ఒక్కరిపై కేసులు పెడతానని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారనే విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు. “ఈ వ్యవస్థీకృత దాడుల వెనుక ఎవరున్నారో నాకు తెలుసు. వారిని కూడా తగిన విధంగా ఎదుర్కొంటాను” అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడికి ఆస్కారం లేదు, మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి ఘటన నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని అన్నారు.