పల్నాడు జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో గత అర్ధరాత్రి కొందరు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కాల్పులతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
రైలు తుమ్మలచెరువు వద్దకు రాగానే ఓ ముఠా రైలులోకి ప్రవేశించి చోరీకి సిద్ధమైంది. గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దుండగులను చెదరగొట్టేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకీ శబ్దాలతో భయపడిపోయిన దొంగలు, దోచుకోవడానికి తెచ్చిన వస్తువులను అక్కడే వదిలేసి చీకట్లోకి పరారయ్యారు.
ఈ ప్రాంతంలో కొద్దికాలంగా బీహార్, మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ ముఠాలు రెండుసార్లు దొంగతనాలకు పాల్పడ్డాయని, శనివారం రాత్రి మూడోసారి దోపిడీకి ప్రయత్నించడంతో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పరారైన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.