ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భూకేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఐఏఎంసీలో అతి తక్కువ కేసులు విచారిస్తున్నారని, దీనికి నిరంతరం నిధులు కేటాయించినా నిలబడే పరిస్థితి కనిపించడంలేదని వ్యాఖ్యానించింది. ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంటే ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకి ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రైవేటు సంస్థ అయిన ఐఏఎంసీకి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామ పరిధిలోని సర్వే 83/1లో 3.70 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2021లో అప్పటి ప్రభుత్వం జీవో 126 జారీ చేసింది. అలాగే ఐఏఎంసీ నిర్వహణకుగాను రూ.3 కోట్లు కేటాయించేందుకు వీలుగా 76, 365 జీవోలనూ ఇచ్చింది. దీంతోపాటు రూ.3 కోట్లకు పైగా విలువ కలిగిన ప్రభుత్వ కేసులను ఐఏఎంసీకి రిఫర్ చేయాలని పేర్కొంటూ జీవో 6ను జారీ చేసింది. అయితే భూ కేటాయింపు సహా ఇతర జీవోలను సవాల్ చేస్తూ 2023లో కోటి రఘునాథరావు, ఎ.వెంకట్రామిరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. అత్యంత విలువైన భూమిని ప్రైవేటు సంస్థ అయిన ఐఏఎంసీకి ఉచితంగా కేటాయించడం చెల్లదని పేర్కొన్నారు. తెలంగాణ అర్బన్ ఏరియా డెవల్పమెంట్ యాక్ట్-1975 చట్టంతోపాటు అనేక సుప్రీంకోర్టు తీర్పులు ప్రభుత్వ భూమిని బహిరంగ వేలం ద్వారా మాత్రమే విక్రయించాలని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పైగా, ప్రైవేటు సంస్థ నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ.. అధిక ఖర్చుతో కూడుకున్న ఐఏఎంసీకి ప్రభుత్వ కేసులు ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. ఐఏఎంసీ ట్రస్ట్ డీడ్లో ఆస్తులను అమ్ముకునే హక్కును బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు కల్పిస్తూ నిబంధనలు పొందుపరిచారని, ఇది చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదిస్తూ.. సంస్థాగతమైన ఆర్బిట్రేషన్ను ప్రోత్సహించాలని కేంద్రం నియమించిన హైలెవల్ కమిటీ సిఫారసు చేసిందని తెలిపారు. సింగపూర్, లండన్ తరహాలో భారత్లో కూడా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ అవసరమన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఐఏఎంసీతో ఒప్పందం చేసుకుందని, అందులో భాగంగానే భూకేటాయింపు జరిగిందని చెప్పారు. మరో ప్రతివాదిగా ఉన్న ఐఏఎంసీ సైతం ఇదే తరహా వాదన వినిపించింది. వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎంసీకి చేసిన భూకేటాయింపు ఏపీ (తెలంగాణ ఏరియా) ఏలియనేషన్ ఆఫ్ స్టేట్ అండ్ ల్యాండ్ రెవెన్యూ రూల్స్ -1975, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ- 2012కు విరుద్ధమని ప్రకటించింది. ఉచితంగా భూమి ఇవ్వాలని ఏ నిబంధనల్లోనూ లేదంది. ఐఏఎంసీ ప్రదర్శన, భవిష్యత్తుపైనా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి 29 నాటికి 15 ఆర్బిట్రేషన్ కేసులు చేశారని, అందులో 11 కేసులు ఉచితంగా చేసినవేనని పేర్కొంది. 57 మీడియేషన్ కేసులు చేశారని, అందులో 17 కేసులు ఉచితంగా చేశారని తెలిపింది. ఇంత తక్కువ కేసులతో ఐఏఎంసీ తనంత తాను నిలబడుతుందా అనే అంశంపై ఆందోళనలున్నాయని వ్యాఖ్యానించింది.