మెదక్ జిల్లా కోర్టు భవనం పైనుంచి దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై దవాఖానలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర ఘటన శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ప్రాథమిక వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలానికి చెందిన రమ్య, నవీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. గతంలో కుటుంబ కలహాలతో రమ్య, నవీన్ మధ్య గొడవ జరిగింది.
రమ్య తల్లిగారి ఇంటిని తగలబెట్టిన కేసులో నవీన్ నిందితుడు. ఈ కేసులో నవీన్ బైకు, మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. ఈ విషయంలో మెదక్ జిల్లా కోర్టుకు శనివారం చేరుకున్న నవీన్, రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలో గొడవపడ్డారు. మూడో అంతస్థుకు చేరుకొని కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మరణించింది. భర్త నవీన్కు తీవ్రగాయాలు కావడంతో జిల్లా కేంద్ర దవాఖానలో చేర్పించారు. ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్రగాయాలు కావడంతో వారిని హైదరాబాద్కు తరలించారు. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని జడ్జితోపాటు డీఎస్పీ, సీఐ పరిశీలించారు.