ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (RCB) ప్లేయర్ యష్ దయాల్పై కేసు నమోదైంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘజియాబాద్ ఇందిరాపురం పోలీస్స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతి యూపీ సీఎం సీఎం పోర్టల్లో దయాల్పై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శారీరకంగా.. మానసికంగా వేధించాడని ఆరోపించింది. సదరు క్రికెటర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సీఎం పోర్టల్లో చేసిన ఫిర్యాదులో ఆ అమ్మాయి తాను ఐదు సంవత్సరాలుగా క్రికెటర్తో సంబంధం ఉందని.. తనను పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టాడని.. కాబోయే కోడలంటూ కుటుంబానికి చూపించాడని.. ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది.
కొంతకాలం తర్వాత ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై ప్రశ్నించిన సమయంలో తనను వేధించినట్లుగా పేర్కొంది. ఈ విషయంపై ఈ నెల 14న మహిళా హెల్ప్లైన్లో ఫిర్యాదు చేశానని.. కానీ, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించింది. పోలీసులకు ఆధారాలు చూపించానని.. బాధితురాలు వాట్సాప్, స్క్రీన్షాట్స్, వీడియోకాల్స్, క్రికెటర్తో ఉన్న ఫొటోలను పోలీసులకు ఆధారాలుగా చూపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యష్ దయాల్పై కేసు నమోదు చేసినట్లు డీసీపీ నిమిష్ పాటిల్ తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని, వాస్తవాల ఆధారంగా చర్యలుంటాయని పేర్కొన్నారు.