ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న (Russia business ties) భారత్, చైనాపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం (Lindsey Graham) హెచ్చరించారు. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు.
ఏబీసీ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్సే గ్రాహం మాట్లాడుతూ.. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్ (India), చైనా (China) దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యూఎస్ సెనేట్లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్ తెచ్చే ఈ బిల్లు భారత్, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.