మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వస్తుందని సమాచారం తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు బుధవారం వేకువజామున 5గంటల నుంచి బారులు దీరారు. సొసైటీ కేంద్రం నుంచి అంబేద్కర్ సెంటర్ సమీపం వరకు క్యూలో నిల్చొని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంత కష్టపడి క్యూలో ఉంటే ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా చొప్పున పంపిణీ చేయగా, బస్తాలు దొరకక సుమారు 200 మంది రైతులు వెనుదిరిగారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలకేంద్రంలోని సొసైటీ ఎరువుల గోదాముకు యూరియా రావడంతో రైతులు బుధవారం ఉదయం నుంచే బారులు తీరారు. 888 బస్తాలు రాగా ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున అందజేశారు. కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ కార్యాలయం వద్ద రైతులు తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. వర్షం కురుస్తుండటం.. సొసైటీ వద్ద సౌకర్యాలు లేకపోవడంతో రైతులు తడుస్తూనే యూరియా బస్తాలు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది.
200 బస్తాలకు 600 మంది రైతులు ఎక్కడ: మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ప్రాథమిక సహకార కేంద్రానికి బుధవారం 200 యూరియా బస్తాలు రాగా, 600 మంది రైతులు క్యూ కట్టారు. 200 మందికి యూరియా బస్తాలు ఇవ్వగా, మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. చెన్నూర్లోని పీఏసీఎస్కు ఒకే లారీ లోడ్ రావడంతో రైతులకు సరిపడా యూరియా అందించలేదు. దీంతో రైతులు మంత్రి వివేక్పై మండిపడ్డారు. పట్టణానికి చెందిన రైతు చైతన్య ధర్నా చేపట్టడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు.


