హైదరాబాద్లోని మాదాపూర్లో అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచార వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ దేశాలతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను ఉపయోగించి వ్యభిచారం చేయిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అలాగే, 9 మంది యువతులను రక్షించారు.
మాదాపూర్లోని బీఎస్ఆర్ సూపర్ లగ్జరీ హోటల్లో ఈ వ్యభిచార దందా వ్యవస్థీకృతంగా కొన్ని వెబ్సైట్ల ద్వారా నడుస్తోందని దర్యాప్తులో తేలింది. హోటల్ సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని, కస్టమర్ల కోసం గదులు బుక్ చేస్తున్నారు.
నాంపల్లికి చెందిన హమీర్ సింగ్ అలియాస్ అమీద్ సింగ్ ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇతనితో పాటు నిఖిల్, సోనియా సింగ్, విశాల్ భయ్యా, శృతి, రోహిత్, రమేశ్లు కూడా ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారు. మహబూబ్నగర్కు చెందిన తమ్మి శ్రీనివాస్, కడపకు చెందిన పోకల వెంకటేశ్వర్లు హోటల్ సూపర్వైజర్లుగా పనిచేస్తూ, కమీషన్ తీసుకుని ఈ వ్యభిచారానికి సహకరించారు.
సమాచారం అందుకున్న సైబరాబాద్ AHTU ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు బృందం హోటల్పై దాడి చేసి, తొమ్మిది మంది యువతులతో పాటు హమీర్ సింగ్, తమ్మి శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ తూము, ఆకాశ్ బజాజ్, మహ్మద్ వసీమ్, పార్థిబన్లను అరెస్టు చేసింది. రక్షించిన 9 మంది యువతులను రెస్క్యూ హోం కి తరలించారు.
సైబరాబాద్ మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం డీసీపీ కరణం సృజన ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ, నిందితులు వ్యవస్థీకృతంగా విదేశీ, దేశీయ యువతులను అక్రమంగా రప్పించి వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితులను మాదాపూర్ పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు.


