గృహ హింస నిరోధక చట్టంని దుర్వినియోగం చేసి తనని, తన కుటుంబాన్ని సతాయిస్తున్న తన భార్య ఆగడాల గురించి బెంగళూరులో 24 పేజీల సూసైడ్ నోట్ ని, 80 నిమిషాల వీడియోని తయారుచేసి మరీ అతుల్ సుభాష్ అనే టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతుల్ సుభాష్ మరణం ఖచ్చితంగా విషాద పరిణామమే. ఈ సందర్భంగా ఆ చట్టం దుర్వినియోగం అవుతుందనీ, అమాయకులైన భర్తలు, వారి కుటుంబాల వారూ బలైపోతున్నారనీ, స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించి భారతదేశపు చట్టాలన్నీ కేవలం పురుషుడినే బోనులో నిలబెడుతున్నాయని, ఇలాంటి పక్షపాత చట్టాల్ని కొనసాగించకూడదన్న ఆభిప్రాయాలు, ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. “జస్టీస్ ఫర్ సుభాష్”, “మెన్స్ కమిషన్ కావాలి”అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
నిజమే సుభాష్ భార్య చేసింది ప్రతి హింసా కాదు, ప్రతిఘటనా కాదు. ఆమె గృహ హింస నిరోధక చట్టంని దుర్వినియోగం చేసింది. మృతుడి వెర్షన్ వింటే ఎంతో బాధ కలుగుతుంది. తాను సంపాదించే ప్రతి రూపాయి తన శత్రువు బలపడటానికే వినియోగింపబడుతున్నదని అతను అన్నాడు. భరణం చెల్లించలేకపోతే సుభాష్ చచ్చిపోవాలని న్యాయస్థానంలో అతని భార్య అన్న మాటకి జడ్జి నవ్వినప్పుడు అతను అతలాకుతలమైపోయాడు. అతని ఆత్మహత్యకి కారకురాలిగా ఇప్పటికే ఆమె మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆమెకి శిక్ష పడినప్పుడు అతనికి న్యాయం జరిగినట్లే భావించాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన కేసుగానే భావించాలి. గృహ హింసని ఎదుర్కొంటున్న స్త్రీలందరూ నిజానికి కోర్టు మెట్లెక్కడం లేదు. ఎక్కిన వారందరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. భార్య పుట్టింటికి వెళ్లి, తిరిగి రాకపోతే కూడా ఉక్రోషంతో ఆత్మహత్య చేసుకున్న భర్తల ఉదంతాలున్నాయి. ఆత్మహత్య అనేది వ్యక్తి బలహీనతే. ముఖ్యంగా భర్తల బాధల్లో, రోదనల్లో, ఆత్మహత్యల్లో వారి అహం దెబ్బ తినడం కనిపిస్తుంది. తాను సంపాదించిన ప్రతి రూపాయి తన మీద పోరాటానికి తన శత్రువు ఉపయోగించుకుంటున్నదన్న సుభాష్ వాదనలో సమంజసత్వమెంతుంది? తన కుమారుడి మెయింటెనెన్స్ కి అది ఉపయోగపడదా? కుమారుడి పట్ల తనకి బాధ్యత వుండదా? అతని భార్య ముక్కు పింది మరీ మెయింటెనెన్స్ వసూలు చేయడం అతని అహాన్ని దెబ్బ తీసిందనేది వాస్తవం. అతని ఆత్మహత్య విషాదమే కావచ్చు కానీ అతను చెప్పిందంతా సమంజసం అయ్యుండాలనేం లేదు. న్యాయమూర్తి లంచం అడగటం గురించి కూడా సుభాష్ ప్రస్తావించాడు. అయితే అవినీతికి, లంచగొండితనానికి న్యాయ వ్యవస్థ అతీతం కాదు. లంచగొండులు స్త్రీలని ఉపేక్షిస్తారని అనుకోలేం. కోర్టు మెట్లెక్కిన స్త్రీ పురుషులెవరైనా అనేక దశల్లో దాన్ని భరిస్తూనే వుంటారు.
మనం గుర్తించాల్సిన విషయమేమంటే సుభాష్ ది అరుదైన కేసు. అరుదైన కేసుల్ని జనరలైజ్ చేయలేం. స్త్రీల గురించిన రక్షణాత్మక చట్టాలు (ప్రొటెక్టీవ్ లెజిస్లేషన్స్) తీవ్ర విమర్శలకు గురవుతున్న నేపథ్యంలో మన పురుషాధిక్య వ్యవస్థలో పురుషులు స్త్రీలను ఎక్కువగా హింసిస్తారా లేక స్త్రీలే పురుషుల్ని ఎక్కువగా హింసిస్తారా అనే ప్రశ్న వేసుకోవాలి. ఏది మెజారిటీ వాస్తవమనేది మనకి తెలియని విషయం కాదు. ఈ చట్టాలలోని లోపాలు ఏమైనా వుంటే పరిహరించుకోవాలి కానీ అసలు ఆ చట్టాలే వద్దంటే, భావోద్వేగాలకు కొట్టుకుపోయి వాటి అవసరాన్ని తిరస్కరిస్తే నాగరిక ప్రయాణం నుండి వెనుకడుగులు వేసినట్లే.
అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో ముఖ్యంగా గృహ హింస నిరోధక చట్టం తీవ్ర విమర్శలకు గురవుతుంది. మన దేశంలో సాధారణంగా జరిగిపోయే అన్యాయాలకి అలవాటు పడిపోయాం. పురుషుడు స్త్రీని హింసిస్తే ఆ స్త్రీ పట్ల కలిగే సానుభూతి కంటే స్త్రీ చేతిలో హింసకి గురయ్యే పురుషుడి పట్ల ఏర్పడే సానుభూతే పెద్దది. రేసిజం కంటే రివర్స్ రేసిజం ఎక్కువ విమర్శలకి గురవుతుంది. ఎక్కువ చర్చకి దారి తీస్తుంది. ప్రస్తుతం కొన్ని ఫేక్ కేసుల్ని చూపించి హింస నుండి రక్షణ కోసం ఏర్పరిచిన చట్టాల అవసరతని ప్రశ్నించడం జరుగుతున్నది. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్ పెరుగుతున్నది. అంటే ఇది పురుషాధిపత్య వ్యవస్థ కాదని, స్త్రీలే ఎక్కువగా హింసకి గురవుతున్నారనేది వాస్తవం కాదని, స్త్రీ పురుషులిరువురూ సమానస్థాయిలోనే హింసకి గురవుతున్నారని అనుకోవాలన్నమాట. తొంభై మంది పురుషులు చేసే నేరాలు, పది మంది స్త్రీలు చేసే నేరాలు ఒకే గాటన కట్టి చూడాలన్న మాట. అంటే ఇది లింగ వివక్షకి సంబంధించిన ఈవ్ టీజింగ్, గృహ హింస, ప్రేమించి మోసం చేయడం, గర్భిణిని చేసి బాధ్యతారహితంగా వదిలేయడం వంటి నేరారోపణల నుండి పురుషులకు దాదాపుగా సేఫ్ పాసేజ్ ఇవ్వడం వంటిదే. రేప్ జరిగిందంటే పురుషుడు స్త్రీని చేశాడా లేక స్త్రీనే పురుషుడిని చేసిందా అని అడగాలన్న మాట. ఇవాళ గృహ హింస చట్టం దుర్మార్గమైందని అనగలిగినప్పుడు రేపెప్పుడో చిన్న పిల్లల మీద లైంగిక అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన పోక్సో చట్టం కూడా అన్యాయమైందని అనొచ్చు. ఇది వాంఛనీయమా?
గృహ హింసా చట్టాన్ని ఎదుర్కొంటున్న పురుషులు, వారి కుటుంబ సభ్యులు కొందరితో నేను మాట్లాడాను కూడా. తాము చేయని తప్పులు చేసినట్లు, అనని మాటలు అనినట్లు చార్జిషీట్లో పెట్టారని వాపోయారు. అవి నిజమే కావచ్చు. వారి తప్పుల్ని, మాటల్ని పెద్దవి చేసి చూపించొచ్చు. వరకట్నం కొన్ని కేసుల్లో అసలు సమస్య కాకపోయినా చేర్చి వుండొచ్చు. కానీ భర్త, అతని కుటుంబ సభ్యుల ప్రవర్తనల్లో పురుషాధిక్య భావజాలాల ప్రభావం లేదని, వుండదని చెప్పలేం. భౌతిక హింస, బూతులు, దూషణలు వంటి మౌఖిక హింస (రికార్డింగ్స్, ఉత్తరాలు, మెసేజిలు వుంటే తప్ప) నిరూపించడం కష్టం కాబట్టి తాను ఎదుర్కొన్న అన్యాయాన్ని భార్య పెద్దది చేసి చెప్పొచ్చు. అంతేకానీ అసలు ఏ రకమైన వివక్షకీ అవకాశం లేకుండానే కేసుల వరకైతే వచ్చే అవకాశం లేదు. పైగా భర్త, అతని కుటుంబసభ్యుల్లో ఏ కోశానా తాము చేసిన తప్పులు పట్ల పశ్చాత్తాపం కనిపించదు. కనిపించదు కూడా! ఎందుకంటే ఒక స్త్రీ తమ కుటుంబాన్ని లీగల్ గా ఇబ్బంది పెట్టడంలో వారి అహం దెబ్బ తింటుంది. భార్య తల్లిదండ్రులు తమ కుమార్తెకి మంచి చెడు చెప్పకుండా, పర్యవసనాలు వివరించకుండా కోర్టు, కేసుల వరకు తీసుకొచ్చారని ఆడిపోసుకునే పురుషుడి తరపు వారు తమ పుత్రుడికి ఏ మంచి చెప్పారో, ఎలా వివేకంగా వవహరించి వుండాలో చెప్పే వుంటారా? నాకైతే ఎలాంటి సందేహం లేదు చెప్పి వుండరని!
బలవంతుల నుండి బలహీనులకు రక్షణ కల్పించడం ద్వారానే మానవ సమాజం ఆధునిక నాగరికత యుగంలోకి ప్రయాణించింది. ఈ రక్షణ చట్టాల ద్వారానూ, నైతిక విలువల ద్వారానూ, దైవ మతపరమైన సంస్కృతీ సంప్రదాయాలను సంస్కరించుకోవడం ద్వారానూ అభివృద్ధి చేయబడింది. ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగవలసిందే. ఈ ప్రక్రియ లేకుంటే మానవ సమాజం ఎలాంటి పురోగతి లేకుండా “మైట్ ఈజ్ రైట్” అనే ఆదిమ, అనాగరిక భావపు ఛత్ర ఛాయలోనే ఇంకా మనుగడ సాగిస్తుండేది.
అన్ని రక్షణ సాధనాల్లోనూ చట్టం అత్యంత శక్తివంతమైనది. దుర్మార్గమైన పురాతన భావాలను పట్టుకు వేలాడేవారి మెడలు వంచగలిగేది చట్టాలే. మార్పు కోసం ఉద్యమాలు, సంస్కరణల ప్రచారంతో పాటు చట్టాల అమలు కూడా తప్పనిసరి. మనిషి ప్రాణం కన్నా, గౌరవనీయమైన జీవితం కన్నా, ఆత్మాభిమానం కన్నా మించింది ఒక నాగరిక సమాజానికి ఇంకేం లేదు. చట్టాలు ఆ దిశగానే బలవంతుల నుండి బలహీనుల్ని రక్షిస్తుంటాయి. లేకుంటే సతీ సహగమనాలు, బాల్య వివాహాలు, వరకట్నాలు, వెట్టి చాకిరి, బాల కార్మిక వ్యవస్థ ఇంకా కొనసాగుతుండేవి. నిజానికి ప్రతీ దురాచారానికి వెనకాల కులం, జెండర్ కారణాలుంటాయి. ఆర్ధికంగా, సామాజికంగా బలహీన కులాలపై కుల హింస, స్త్రీలపై గృహ హింస ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఆయా పీడిత వర్గాలకు రక్షణగా ఎస్.సి./ఎస్టి. అత్యాచారాల నిరోధక చట్టం, గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చాయి. ఈ చట్టాలు అంత తేలికగా రూపొంది, అమల్లోకి రాలేదు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఆయా వర్గాల డిమాండ్లు చట్ట రూపం తీసుకొని అమల్లోకి వచ్చాయి. అక్కడక్కడా జరిగే దుర్వినియోగాన్ని చూపించి ఈ చట్టాలని బలహీనపరిస్తే లేదా ప్రత్యామ్నాయ చట్టాలను తీసుకొస్తే భారతీయ సమాజం మరింత సంక్షోభంలోకి వెళుతుంది.
ఈ సమస్యకి తక్షణం సూచించగలిగిన శాశ్వత పరిష్కారాలంటూ లేవు. వివాహబంధాన్ని ఓవర్ సెంటిమెంటలైజ్ చేసి, విడాకుల్ని సంక్లిష్టం చేసే విధంగా వున్న లీగల్ ప్రక్రియల్ని సరళతరం చేయాలి. స్త్రీలు కూడా పురుషులంత చదువుకుంటున్నప్పుడు, సంపాదించగలుగుతున్నప్పుడు, సమాజంలో ఎదగగలుగుతున్నప్పుడు ఇంకా పురుషాధిక్యతని మోసే ప్రజాస్వామికత లోపించిన కుటుంబ బంధాలు ఎక్కువ కాలం నిలవవు. వివాహ వ్యవస్థకి ఆపాదించబడుతున్న పవిత్రత, భార్యాభర్తల సంబంధాలకు పులుముతున్న సెంటిమెంట్లు నిలిచేవి కావు. ఈ కరుకు వాస్తవాన్ని గ్రహించి, అంగీకరించి స్త్రీ పురుష సంబంధం మొత్తం వివాహం, కుటుంబం చుట్టూ తిరగాల్సిన అవసరం పడనప్పుడు, ఒకవేళ విడిపోవాల్సే వస్తే పిల్లల పెంపకంతో సహా బాధ్యతల్ని ఒక సదవగాహనతో పంచుకోగలిగినప్పుడు స్త్రీ పురుషులిరువురూ ఏ స్థాయిలోనైనా ఒకరినొకరు హింసించుకోలేరు. దోపిడీ చేసుకోలేరు. ఏ ఆధిపత్య భావజాలాలు స్పృసించలేని ప్రేమ సమ బంధమొక్కటే ఆరోగ్యకరమైన స్త్రీ పురుష సంబంధానికి పూచీ పడగలదు.
-అరణ్యకృష్ణ