కేంద్ర హోం మంత్రి అమిత్షా గత ఏడాది డిసెంబర్ 13 నుంచి మూడు రోజులు చత్తీస్ఘడ్లో పర్యటించాడు. ఆ సందర్భంగా ఆయన మావోయిస్టు రహిత భారత్ అనే స్వప్నం సాకారమవుతోందని అన్నాడు. మావోయిస్టులందరినీ చంపేయడానికి భద్రతా బలగాలు సిద్ధంగా, ఉత్సాహంగా ఉన్నాయని అన్నాడు. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. అక్కడ బాబాసాహెబ్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
మొదటి మాట ఆదివాసీ హక్కుల గురించి, మావోయిస్టు ఉద్యమం గురించి పట్టించుకునేవారికే వినిపించింది. మిగతా వాళ్లకు కూడా వినిపించే ఉండొచ్చు. కానీ మౌనం పాటించారు. తెలుగు సమాజంలోని గౌరవనీయ పాత్రికేయులు, మేధావులు, రచయితలు ఇందులో మొదటి వరుసలో ఉన్నారు.
రెండో మాట మీద దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలతో సహా రోడ్డు మీదికి వచ్చాయి. నిజానికి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయవలసిన విషయం. చేసిన మేరకైనా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానిస్తారా? అనేదే ప్రధానమైంది. ఆ మాట అనవలసిందే. కానీ అంబేద్కర్ అవగాహనలో అతి ముఖ్యమైన సమానత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని, కార్పొరేటీకరణ వల్ల పెద్ద ఎత్తున ఆసమానతలు పెరుగుతున్నాయని, కుల అసమానతలకు తోడు ఫాసిస్టుల ఆర్థిక విధానాలతో అంతరాలు తీవ్రమవుతున్నాయనే విమర్శ ప్రధానం కావలసి ఉండింది. రాహుల్ గాంధీ నుంచి ఈ మాట అశించలేం. అంబేద్కర్ వాదులు కూడా అనలేదు. ప్రతి వ్యక్తికి ఒకే విలువ అని చెప్పిన బాబాసాహెబ్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ పాలన తయారైందని అనలేదు. అంబేద్కర్ అంటే ఫాసిస్టులకు ఎందుకు ఇంత అసహనమో సమగ్రంగా వివరించలేకపోయారు. ఆదివాసీ ప్రేమికులు, విప్లవాభిమానులు మాత్రమే అంబేద్కర్ మీది అమిత్షా వ్యాఖ్యను వీలైనంత సమగ్రంగా చెప్పేందుకు ప్రయత్నించారు.
అమిత్షా చేసిన పై రెండు వ్యాఖ్యల మధ్య ఏ సంబంధం లేదని అనుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు. కాకపోతే భారతీయ ఫాసిజాన్ని అర్థం చేసుకోలేని వాళ్లుగా మనం మిగిలిపోతాం. ఏదో ఒక సరళ సూత్రీకరణలోకి కుదించి చూస్తే హిందుత్వ ఫాసిజం అర్థమయ్యేది కాదు. హిందుత్వంలోని సనాతనవాదాన్ని, తిరోగమనాన్ని, మనుధర్మాన్ని గుర్తించినట్లే, హిందుత్వ ఫాసిజమంటే కార్పొరేట్ ఫాసిజం అని కూడా గుర్తించాలి. అప్పుడే ఆపరేషన్ కగార్ అర్థమవుతుంది. ఫాసిజమంటే సాంస్కృతిక ఫాసిజమని, ఆపరేషన్ కగార్ అంటే సైనిక చర్య అని అనుకొనే మేధో వాతావరణంలో ఫాసిజం వర్థిల్లుతున్నది.
అమిత్షా చత్తీస్ఘడ్ పర్యటన ముందు రోజు డిసెంబర్ 12న రాజలాంఛనాలతో ఆయనకు స్వాగతం పలకడంలో భాగంగా భద్రతాదళాలు నారాయణ్పూర్ జిల్లాలో 8 మందిని కాల్చేశాయి. ఇందులో దుస్రు దాదా అలియాస్ మోహన్రావు ఒక్కరే ఆదివాసేతరుడు. ఆయన సహాయకురాలితో సహా మిగతా ఏడుగురు ఆదివాసులు. అందులో ఐదుగురు సాధారణ ఆదివాసులు. ఈ ఘటనలో మరో నలుగురు ఆదివాసీ పిల్లలు గాయపడ్డారు. వాళ్లను ఆదివాసీ నాయకురాలు సోనీసోరీ ఆస్పత్రికి తరలించారు. పాత్రికేయురాలు మాలినీ సుబ్రమణ్యం క్షేత్ర పర్యటన చేసి వాస్తవాలు బైటపెట్టారు. ఆ తర్వాత పోలీసులు ఆ పిల్లలను ఆస్పత్రి నుంచి తప్పించి సమస్యను మాఫీ చేయాలనుకున్నారు.
ఇలాంటి ఘటనలు ఈ ఏడాదిగా సాగుతున్న ఆపరేషన్ కగార్లో లెక్కలేనన్ని జరిగాయి. ఒక్క చత్తీస్ఘడ్లోనే కాదు. సంఘ్ మూకలు దేశంలోని అనేక ప్రాంతాల్లో మతం పేరుతో, కులం పేరుతో, సంస్కృతి పేరుతో దాడులు చేస్తున్నట్లే ఆపరేషన్ కగార్ పేరుతో మహారాష్ట్ర, జార్ఖండ్, ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతం, తెలంగాణ, అంతటా హత్యాకాండ జరిగింది. కర్నాటకలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. కేరళలో తీవ్ర అణచివేత కొనసాగుతున్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ జరుగుతున్న హింసాకాండను ఆపరేషన్ కగార్ అని అంగీకరించకపోవచ్చు. మావోయిస్టు రహిత భారత్ను సాధించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే దేశమంతా ఈ మారణకాండ జరుగుతున్నది.
కాషాయికరణ, కార్పొరేటీకరణ అనే ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతున్న ఫాసిజం ఆపరేషన్ కగార్ను కేవలం సైనిక చర్యగానే మొదలు పెట్టలేదు. మావోయిస్టు నిర్మూలన కోసమే పని చేయడం లేదు. అది మౌలికంగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడానికి ఉన్న అవరోధాలను నిర్మూలించుకుంటూపోయే బహుముఖ యుద్ధం. ఇందులో సాంస్కృతిక విధ్వంసం ఉన్నది. కగార్ మావోయిస్టు నిర్మూలనకేగాని, ఆదివాసులను, భారత ప్రజలను మేం ముట్టుకోం అనే భావజాల సమ్మతి పొందే వ్యూహం ఉన్నది. దేశంలో ఎన్నో ప్రగతిశీల రాజకీయాలు ఉండగా, ఎన్నో పోరాట సంస్థలు ఉండగా ఈ దేశాన్ని ‘మావోయిస్టు రహిత భారత్’గా మార్చాలనే లక్ష్యాన్ని ఫాసిస్టులు పదే పదే ప్రకటించుకుంటున్నారు. మానవతావాదులతో సహా అన్ని భావజాలాలు ఉన్న వ్యక్తులపై, సంస్థలపై దాడులు జరుగుతున్న తరుణంలో మావోయిస్టు నిర్మూలన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికీ ఫాసిజాన్ని, ఆపరేషన్ కగార్ను ఎవరైనా తమ సౌకర్యం కోసం వేర్వేరుగా చూడవచ్చు. కానీ ఆపరేషన్ కగార్ పేరుతో ఫాసిస్టు ప్రభుత్వం అంతర్యుద్ధాన్ని లేవదీసిందని ఈ ఏడాది దేశంలో జరిగిన పరిణామాలు నమోదు చేశాయి. నిజానికి దండకారణ్యంలో ఏం జరుగుతున్నదో సమాచారం బైటికి రాకుండా దిగ్బంధం సాగుతున్నది. ఆదివాసీ ప్రజల చొరవ, వాళ్లకు నాయకత్వం వహిస్తున్న సంస్థలు, స్వతంత్య్ర పాత్రికేయుల వల్ల ఎంతో కొంత సమాచారం బైటికి వస్తున్నది. హత్యలు, అరెస్టుల సంఖ్య నిర్దిష్టంగా తెలిసే పరిస్థితి కూడా లేదు.
గత ఏడాది జనవరి 1వ తేదీన మంగ్లి అనే ఆదివాసీ బాలిక హత్యతో మొదలైన కగార్ ఇప్పటికి దాదాపు 300 మందిని బలితీసుకున్నది. పాలస్తీనాలో వేలమంది మరణాలు చూస్తున్న ఈ విషాదకర వాతావరణంలో ఇదేమీ పెద్ద నెంబర్ అనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ దేశ ప్రభుత్వమే ఈ దేశ ప్రజల మీద చేస్తున్న యుద్ధమిది. ఒక్క దండకాణ్యంలోనే ఏడు లక్షల పోలీసులు, సైనికులు, అర్ధ సైనికులు కేంద్రీకరించి ఉన్నారు. వీళ్లలో బస్తర్ ఫైటర్స్ అనే పేరుతో, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అనే పేరుతో ఆదివాసులు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ దేశ ప్రజలైన వీళ్లందరి చేతుల్లో ఆయుధాలు పెట్టి, ఈ దేశ మూలవాసులైన ఆదివాసుల మీద, ఈ మట్టి బిడ్డలైన మావోయిస్టుల మీద యుద్ధానికి తరలించింది. ఇది యుద్ధమని అనుకోడానికి ఎవరికైనా అభ్యంతరం ఉండవచ్చు. ఇది మామూలు అణచివేతే అనుకోవచ్చు. యుద్ధానికి, అంతర్యుద్ధానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రమాణాలతో ఈ మారణకాండ సరితూగకపోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని యుద్ధమనే అంటున్నది. పైగా చివరి యుద్ధమని అంటున్నది. యుద్ధాల్లో వాడే రాకెట్ లాంచర్లను బస్తర్లో సైనికులు వినియోగిస్తున్నారు. కిలోమీటర్కు ఒక సైనిక క్యాంపు ప్రకారం 300 కేంద్రాలను ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఈ ఏడాదిలో ఎన్నోసార్లు ఫైరింగ్ చేశారు. డ్రోన్ దాడులు చేశారు. వేల మంది అనేక రకాల హింసలు అనుభవించారు. లెక్కలేనంత మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. వందల మంది యువతీ యువకులు అక్రమ కేసుల్లో జైళ్లపాలయ్యారు. గ్రామాల మధ్యనే సైనిక క్యాంపులు పెట్టడం వల్ల ఆదివాసుల రోజువారీ జీవితాన్ని ఏడాదిగా నడుస్తున్న కగార్ ధ్వంసం చేసింది. చిట్టచివరికి ఈ సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా మూడేళ్లకు పైగా జరుగుతున్న నిరాయుధ, శాంతి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మూలవాసీ బచావో మంచ్ అనే సంస్థను చత్తీస్ఘడ్ ప్రభుత్వం నిషేధించింది.
ఈ యుద్ధానికి అవసరమైన బలగాలకు బైట శిక్షణ ఇచ్చి దండకారణ్యానికి తరలించడం కాకుండా ఏకంగా అక్కడే సైనిక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. దీని కోసం సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించారు. సుమారు వంద గ్రామాలను అక్కడి నుంచి తరలించే పనిలో ఉన్నారు. ఈ యుద్ధం ముగిశాక తిరిగి స్వగ్రామాలకు రావచ్చని ఆ గ్రామాల వాళ్లకు ఆశ చూపిస్తున్నారు. నిజానికి ఇది తాత్కాలిక యుద్ధం కాదని పాలకులకూ తెలుసు. శాశ్వత ప్రాతిపదిక మీద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనంత సైనిక కేంద్రీకరణ దండకారణ్యంలోనే ఉన్నదని పరిశీలకులు అంటున్నారు. ఇది రాబోయే కాలంలో మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఇదంతా కేవలం సాయుధ సంఘర్షణే కాదు. కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆదివాసీ పోరాటాలను, విప్లవోద్యమాన్ని నిర్మూలించే రాజకీయార్థిక యుద్ధం. ఫాసిస్టుల కార్పొరేటీకరణ అనే మౌలిక పునాదికి సంబంధించిన విషయం ఇది. ఫాసిజానికి సనాతనధర్మం అనే రక్త రహిత వ్యూహం, ఘోరమైన హింసోన్మాదంతో చెలరేగే సాయుధ వ్యూహం రెండూ ఉన్నాయి. కార్పొరేటీకరణను వేగవంతం చేయడం ద్వారా ఫాసిజానికి శాశ్వతం చేసే బలమైన రాజకీయార్థిక సాంస్కృతిక పునాదిని నిర్మించుకోడానికి హిందుత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఏడాది అదెంత హింసాత్మకంగా ఉంటుందో కగార్ రుజువు చేసింది. ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నీ ఐక్యమైనప్పుడే దాన్ని నిలువరించగలం.
-పాణి