ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి పేరట ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిన్న రాష్ట్రానికి తొలిసారిగా వచ్చారు. నేతలతో సమావేశం అయ్యారు. ఆమెకు పలువురు నేతలు తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసిటనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు మల్లన్నను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.