హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో ప్రణాళిక మొదలుకొని నిర్వహణ వరకు పలు లోపాలను నేషనల్ డ్యాం సెఫ్టీ అథారిటీ గుర్తించినట్లు తెలిసింది. ఏడోబ్లాక్ ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని సిఫార్సు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్ ను రూపొందించే బాధ్యతను కేంద్ర జలసంఘానికి అప్పగించాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండు వారాల క్రితం నివేదికను అందజేయగా, దీనిపై మూడ్రోజుల క్రితం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ చర్చించినట్లు సమాచారం. ఎన్డీఎస్ఏ, జలసంఘం, జల్శక్తి అధికారులకు చంద్రశేఖర్ అయ్యర్ నివేదికలోని ముఖ్యాంశాల గురించి ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. ఈ నివేదికను తదుపరి కార్యాచరణకు ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది.
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి. ఎన్డీఎస్ఏ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిపుణుల కమిటీ వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2024 మార్చి 2న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్ఏ నియమించింది. బ్యారేజీలను అధ్యయనం చేసి వాటి పరిస్థితిని అంచనా వేసి.. ఏయే చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని సూచించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను కూడా అధ్యయనంలో చేర్పించింది. ఈ కమిటీ గత ఏడాది మే1న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. బ్యారేజీలలో నీటిని నిల్వ చేయకుండా గేట్లు తెరిచి ఉంచాలని, పలు పరీక్షలు చేయించాలని సూచించింది.
‘మేడిగడ్డ’కు సంబంధించి పరీక్షలన్నీ పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత పలు సిఫార్సులతో తుది నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ కాలమ్స్లోనూ లోపాలున్నట్లు గుర్తించినట్లు, బ్యారేజీ పైభాగంలో సీకెంట్ పైల్స్ నాణ్యత కూడా సరిగా లేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఫిబ్రవరి 27న జలశక్తి మంత్రి, ఇతర అధికారులకు అయ్యర్ కమిటీ ప్రజంటేషన్ ఇచ్చిందని, త్వరలోనే ఎన్డీఎస్ఏ ద్వారా ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజైన్లతో పాటు సర్వే, ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ తదితర అంశాలన్నింటినీ అధ్యయనం చేసినట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే.. దీనిని కేంద్ర జలసంఘం పరిగణనలోకి తీసుకొని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అనుమతి ఇచ్చేది. ఇకమీదట సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు అక్రిడేటెడ్ వ్యవస్థను పెట్టాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇది అమలులోకి వస్తే అక్రిడేటెడ్ సీడీవోలు ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రమే జలసంఘం పరిగణనలోకి తీసుకొంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాతనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.