విదేశాలలో ఉన్నత విద్యపై భారతీయ విద్యార్థులకు మక్కువ తగ్గింది. గత ఏడాది గణాంకాలు పరిశీలిస్తే విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది. కొవిడ్ తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇదే ప్రథమం. 2023లో వీరు 8,92,989 మంది ఉండగా, 2024 నాటికి 7,59,064కు పడిపోయింది.
కేంద్ర ప్రభుత్వం పార్లిమెంట్ లో ముస్లింలీగ్ ఎంపీ ఈటీ మొహమ్మద్ బషీర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుకాంత మజుందార్ విదేశీ విద్యార్ధుల ట్రెండ్ పై కీలక వివరాలు వెల్లడించారు. ఇందులో గత మూడేళ్లలో విదేశాలకు వెళ్లే విద్యార్ధుల ధోరణుల్లో వచ్చిన మార్పుల్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు. కేంద్రమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో 7,50,365 మంది భారతీయులు విదేశాలలో చదువుతుండగా..2023లో ఈ సంఖ్య 8,92,989కి పెరిగింది. కరోనా తర్వాత ఇలా పెరిగింది. అయితే 2024లో మాత్రం ఇది 7,59,064కి పడిపోయింది. అంటే ఏకంగా 15 శాతం తగ్గిపోయింది.
కెనడా వద్దే వద్దంటున్న విద్యార్ధులు: ముఖ్యంగా కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఈ సంఖ్య 2023లో 2,33,532 నుండి 2024లో 1,37,608కి తగ్గిందని కేంద్రం తెలిపింది. ఇది ఏకంగా 41 శాతం తగ్గుదల కావడం విశేషం. గతేడాది విద్యార్థి వీసా నిబంధనలను కఠినతరం చేయాలనే కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇది వీసా తిరస్కరణ రేట్లు పెరగడానికి, దరఖాస్తుల పరిశీలనను కఠినతరం చేయడానికి, అధ్యయన అనుమతులను రద్దు చేయడానికి కారణమైంది. అలాగే భారత్-కెనడా దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తగ్గుదల కనిపించింది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో చదువుకోవడానికి వెళ్లే భారతీయుల సంఖ్య కూడా తగ్గింది.అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 2023లో 2,34,473 నుండి 2024లో 204,058కి తగ్గింది. ఇది 12.9 శాతం తగ్గుదలగా నమోదైంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అక్కడి విధానాల కారణంగా తలెత్తిన అనిశ్చితి దీనికి కారణమని భావిస్తున్నారు. దీని వల్ల గతేడాది చాలా మంది విద్యార్థులు అమెరికాలో చదువులపై వెనక్కి తగ్గారు.
బ్రిటన్ విషయానికొస్తే 2023లో 1,36,921 నుండి 2024లో 98,890కి విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇది 27.7 శాతం తగ్గుదలగా నమోదైంది. కఠినమైన వీసా నిబంధనల, పోస్ట్-స్టడీ వర్క్ విధానాల వల్ల ఈ సంఖ్య తగ్గినట్లు అంచనా. ఆస్ట్రేలియాలో విద్యార్థుల సంఖ్య కూడా 12 శాతం తగ్గిపోయింది. 2023లో 78,093 నుండి 2024లో 68,572కి తగ్గింది. వీసా ఫీజులు పెరగడం, కఠినమైన అవసరాలు, గృహ స్థోమతపై ఆందోళనలు, ఇటీవలి విధాన మార్పులే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అలాగే చైనాకు ప్రయాణించే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. ఈ సంఖ్య 2023లో 7,279 నుండి 2024లో 4,978కి తగ్గింది.
గత మూడేళ్లలో రష్యాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని కేంద్రం వెల్లడించింది. 2022లో 19,784 మంది విద్యార్థుల నుండి, 2023లో 23,503కి, 2024లో 31,444కి విద్యార్ధుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2022లో 6,406 నుండి 2023లో 7,484కి పెరిగింది. అలాగే 2024లో 8,536కి చేరుకుంది. జర్మనీలో కూడా భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2023లో 23,296, 2022లో 20,684తో పోలిస్తే 2024లో 34,702 మంది విద్యార్థులు అక్కడికి వెళ్లారు. న్యూజిలాండ్లోనుూ 2022లో 1,605 మంది విద్యార్థులతో పోలిస్తే 2024లో 7,297 మందికి పెరిగారు.


