భారతంలో ఏకలవ్యుడు ఒక్క బొటనవేలే పోగొట్టుకున్నాడు. కానీ తమిళనాడులో అగ్రకుల యువకుల కబడ్డీజట్టుని, 11వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థి జట్టు ఓడించినందుకు ప్రతీకారంగా అతని మూడు వేళ్లనీ ఓడిపోయిన జట్టు సభ్యులు కోసేశారు. అదీ అతను పరీక్ష రాయడానికి వెళుతున్న సమయంలో జరిగింది.
ఒక కబడ్డీపోటీ కులఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పైకులానికి చెందిన కబడ్డీ జట్టుని దళిత విద్యార్థి పాల్గొన్న జట్టు ఓడించటంతో ఈ దాడి జరిగిందని బాధిత కుటుంబసభ్యులు చెబుతుండగా, పైకులానికి చెందిన కబడ్డీజట్టు సభ్యుడి సోదరితో బాధిత విద్యార్థికి ఉన్న ప్రేమవ్యవహారం కారణమని పోలీసులు అంటున్నారు.
బాధిత విద్యార్థి అరియనాయగీపురానికి చెందిన ఒక ఇటుకబట్టీ కార్మికుడి కుమారుడు. పేరు దేవేంద్రన్. అతను తిరునెల్వేలి జిల్లాలోని పాలయంకోట్టైలోని తన పాఠశాలకు వెళుతుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం తిరునల్వేలి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం దేవేంద్రన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ముగ్గురు మైనర్లు బస్సును ఆపారు. ఆ తర్వాత దేవేంద్రన్ ని బయటకు లాగి అతనిపై దాడిచేసి అతని ఎడమచేతి మూడువేళ్లు కోసేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ యువకుడి తండ్రిపై కూడా నిందుతులు దాడిచేశారు. ఈ దాడిలో దేవేంద్రన్ తండ్రి తలమీద గాయాలయ్యాయి. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు బాధితులకు సహాయం చేయడానికి వచ్చేసరికి దాడిచేసిన వారు పారిపోయారు. ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహం పెల్లుబీకింది. విద్యార్థి కుటుంబీకులు, దళిత సంఘాల కార్యకర్తలు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే బాధితుడే కాదు, నిందితులు కూడా మైనర్లే. మైనర్లలో కూడా కులతత్వం, దళితుల పట్ల వివక్ష, ఏహ్యభావం, వారినేం చేసినా పర్లేదనే చులకన భావాలు ఎంత పెరిగిపోతున్నాయో ఈ దారుణ సంఘటన తెలియచేస్తున్నది. కేవలం కులతత్వమే కాదు, హింసా ప్రవృత్తి, నేర స్వభావం కూడా నూనుగు మీసాల నవతరాన్ని కూడా వదలడం లేదంటే మన సమాజం ఎంత అథఃపాతాళానికి వెళుతున్నదో తెలుస్తుంది.