హోలీ పండగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సైదాబాద్ భూలక్ష్మీమాతా ఆలయం అకౌంటెంట్పై యాసిడ్ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆలయం లోపలికివచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ అకౌంటెంట్ తలపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే నర్సింగ్ రావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సాయంత్రం సమయంలో ఆలయం లోపలికివచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హ్యాపీ హోలీ అంటూ అకౌంటెంట్ నర్సింగ్ రావుపై యాసిడ్ పోశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఆలయ పరిసరప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. తీవ్ర గాయాలతో అకౌంటెంట్ విలవిలలాడిపోయారు.
సైదాబాద్ ఆలయంలో యాసిడ్దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. నిందితుడి కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. నిందితుడు క్యాప్, మాస్క్ ధరించిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే.. ఇది ముందుగా ప్లాన్ చేసిన దాడిగా అనిపిస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. యాసిడ్ ఘటనను ఆలయ ఛైర్మన్ శ్రీధర్ ఖండించారు. అన్నదానానికి సంబంధించిన వివరాలు అడుగుతూ అకౌంటెంట్ నర్సింగ్రావుపై సడెన్గా దాడిచేసినట్లు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.