గత పదేళ్లకాలంలో దేశీయబ్యాంకులు రూ. 16.35 లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను మాఫీ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఈమేరకు సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు తెలియజేశారు. అత్యధికంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లను రద్దు చేయగా, అత్యల్పంగా 2014-15లో రూ.58,786 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. 2022-23లో మొత్తం రూ.2,16,324 కోట్లు, 2023-24లో రూ.1,70,270 కోట్లను బ్యాంకులు రద్దుచేశాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన విధానాలప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్యాంకులు నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) రద్దుచేస్తాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ రైటాఫ్ ప్రక్రియ కారణంగా రుణగ్రహీతలకు ప్రయోజనం కల్పించినట్టుకాదని, బ్యాంకులు వివిధ రికవరీమెకానిజం ద్వారా రుణాలను తిరిగి వసూలుచేసే ప్రక్రియను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ అసెట్స్ సెక్యూరిటీ అండ్ రీకన్స్ట్రక్షన్ కింద చర్యలు తీసుకోవడం, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అమలు చేయడం, నేషనల్ బ్యాంక్, కంపెనీ లా ట్రిబ్యూనల్లో కేసులు దాఖలు చేయడం వంటి పద్ధతులను చేపడతాయని పేర్కొన్నారు.
RBI గణాంకాల ప్రకారం 2024 డిసెంబర్ ఆఖరు నాటికి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 29 కంపెనీలను NDAలుగా గుర్తించాయి. ఇందులోని ఒక్కో కంపెనీకి రూ.వెయ్యికోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయని ఆర్థికమంత్రి వివరించారు. వీటి విలువ రూ.61,027 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు.