ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుద్దులు అధికార పక్షంలో ముద్దులు అన్నట్టు ఉంది. గతంలో YSRCP అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుల నియామకాలను విమర్శించిన TDP ఇప్పుడు కొత్తగా నలుగురిని AP ప్రభుత్వం సలహాదారులుగా నియమించింది. భారత్ బయోటెక్ MD సుచిత్ర ఎల్లను గౌరవ సలహాదారుగా నియమిస్తూ AP ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ CS విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు.
సుచిత్ర ఎల్ల కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల కాలానికి ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, హస్తకళల అభివృద్ధి రూపకల్పనకు ఆమె నుంచి సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏరో స్పేస్, డిఫెన్స్ గౌరవ సలహాదారుగా సతీష్రెడ్డి ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుగా DRDO మాజీ చీఫ్ జి.సతీష్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం సతీష్రెడ్డి కేంద్ర రక్షణశాఖ సలహాదారుగా ఉన్నారు. రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఆయన్ను కోరింది. పారిశ్రామిక కారిడార్లు, క్లస్టర్లు, టెస్టింగ్ ఫెసిలిటీల్లో పరిశ్రమల ఏర్పాటు, ఏఐ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డీప్టెక్లో సలహాలు, సూచనలు ఇవ్వాలని సతీష్ రెడ్డిని ప్రభుత్వం కోరింది. యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చేలా ఆయన సలహాలు ఇవ్వనున్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ నియమితులయ్యారు. గాంధీని రెండేళ్ల పాటు కేబినెట్ ర్యాంకు హోదాలో నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా శ్రీధర పనిక్కర్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సోమనాథ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేస్తున్నారు. పాలనా వ్యవహారాలు, పరిశ్రమలు, పరిశోధనలో సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.